ప్రేమించలేదని కడతేర్చాడు | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని కడతేర్చాడు

Published Wed, Jun 10 2015 2:46 AM

boyfriend killed by girlfriend

సేలం: తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని నాలుగేళ్లుగా వెంటబ డ్డాడు.. చివరకు ఉన్మాదిగా మారా డు. తాను ప్రేమించిన బాలికను అతి కిరాతకంగా కడతేర్చాడు. సేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం జిల్లా వీరపాండికి చెందిన రవి కుమార్తె తారణి(17) స్థానికంగా ఓ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది.  అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్ముగం కుటుంబం రవికి దూరపు చుట్టం. ఆర్ముగం కుమారుడు లోకనాథన్(22) చేనేత కార్మికుడు. దూరపు చుట్టం కావడంతో తరచూ రవి ఇంటికి వచ్చి వెళ్లే వాడు. ఈ పరిస్థితుల్లో తారణి మీద లోకనాథన్ మనస్సు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించాడు. ఈ విషయాన్ని తండ్రి ఆర్ముగం, తల్లి మణి మేఘలై దృష్టికి తీసుకెళ్లాడు. నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని రవి వద్ద తారణిని ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం మాట్లాడేందుకు యత్నించాడు.

ఇందుకు రవి నిరాకరించాడు. తన కుమార్తె చదువుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి తనను ప్రేమించాలని లోకనాథన్  తారణి వెంట బడడం మొదలెట్టాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటపడేవాడు. అయితే లోకనాథన్‌ను తారణి పట్టించుకునేది కాదు. నాలుగేళ్లుగా ఒన్ సైడ్ ప్రేమలో మునిగి ఉన్న లోకనాథన్‌లోని ఉన్మాది బయటకు వచ్చాడు. నాలుగు నెలల క్రితం తార ణిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని రవి మీద ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తారణితో పాటుగా రవి సైతం నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన లోకనాథన్ రవిని చితకొట్టి ఉడాయించాడు. దూరపు చుట్టం అన్న ఒక్క కారణంతో లోకనాథన్‌పై ఎలాంటి కేసు పెట్టకుండా రవి క్షమించి వదలి పెట్టాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న తారణిని లోకనాథన్ అడ్డగించాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ప్రాథేయ పడ్డాడు. ఇందుకు తారణి నిరాకరించింది. చీవాట్లు పెట్టింది. అతడ్ని తప్పించుకుని ఇంటి వైపుగా వెళ్లేందుకు యత్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన లోకనాథన్ ఉన్మాదిగా మారాడు.

తన చేతిలో ఉన్న  కత్తితో తారణి శరీరంపై 11 చోట్ల విచక్షణ రహితంగా పొడిచాడు. సంఘటన స్థలంలో రక్తపు మడుగులో తారణి  కుప్పకూలింది. అదే సమయంలో అటు వైపుగా లోకనాథన్ తల్లి మణి మేఘలై రావడం, తనయుడు ఉన్మాది చర్యను గుర్తించి అడ్డుకునే యత్నం చేసింది. అప్పటికే లోకనాథన్ ఉడాయించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తారణిని స్థానికుల సాయంతో మణి మేఘల ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే తారణి ప్రేమోన్మాది ఘాతుకానికి నేల రాలింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనతో వీరపాండి గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లేందుకు యత్నించిన లోకనాథన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశా రు. తారణి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుం బీకులకు అప్పగించారు. దూరపు చుట్టం అన్న విషయాన్ని పక్కన పెట్టి  తన మీద దాడి చేసినప్పుడే లోకనాథన్‌ను పోలీసులకు పట్టించి ఉంటే, తన కుమార్తె బలి అయ్యేది కాదని తండ్రి రవి కన్నీరుమున్నీరయ్యాడు.
 

Advertisement
Advertisement