రాష్ట్రంలో పండుగ కోలాహలం నెలకొంది. ఎటు చూసినా అన్నాడీఎంకే ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కళకళలాడుతున్నాయి. ఇందుకు కారణం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం పురట్చి తలైవి జయలలిత సోమవారం 66వ వసంతంలోకి అడుగు పెడుతుండడమే. తమ అధినేత్రి పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అన్నాడీఎంకే నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి, చెన్నై : పురట్చితలైవి అంటే విప్లవనారి, నాయకి అని అర్థం. తమిళనాట అమ్మగా పేరొందిన జయలలిత విప్లవ వనిత అని అందరికీ తెలుసు. నిర్ణయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా వెల్లడించే సత్తా ఉన్న జాతీ య నాయకుల జాబితాలో ఆమె ఉన్నారు. జాతీయ కూటములకు సైతం ముచ్చెమటలు పట్టించిన ఘనత ఆమెది. ఏం చేసినా అందరికీ భిన్నంగా సంచలనం సృష్టించడంలో ఆమెది ప్రత్యేక శైలి. రానున్న లోక్సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో
కోలాహలం
ప్రధాని సింహాసనంపై కూర్చోవాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న పురట్చి తలైవి సోమవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. వేడుకలు : తమ అధినేత్రి జన్మదినాన్ని పండుగ తరహాలో జరుపుకునే పనిలో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. ఈనెల 14 నుంచే ఈ పుట్టిన రోజు వారోత్సవాలు ఆరంభం అయ్యాయి. రక్తదాన శిబిరంతో గిన్నిస్ రికార్డును దక్కించుకున్నారు. రోజుకో చోట ప్రత్యేక రీతిలో వేడుకలు జరుగుతున్నాయి. రక్తదానం, అన్నదానం, ఆలయాల్లో పూజలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పంపిణీల్లో, క్రీడా పోటీలు, మారథాన్లు, ఇలా పలు రకాల పోటీల నిర్వహణలో బిజీ బిజీగా ఉన్న నాయకులు సోమవారం తమ అధినేత్రి పుట్టినరోజును కోలాహలంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
వినూత్నంగా...: విప్లవ వనిత 66వ వసంతంలోకి అడుగు బెడుతుండడంతో వినూత్నంగా 66 రకాల కార్యక్రమాల నిర్వహణలో అన్నాడీఎంకే వర్గా లు ఉన్నాయి. ఎటు చూసినా జయలలిత ఫ్లెక్సీలు, అన్నాడీఎంకే జెండాలు, తోరణాలు కళకళలాడుతున్నాయి. ఉదయాన్నే ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. ఇది వరకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానానికి చర్యలు తీసుకున్నారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ పథకాల పంపిణీ, 66 కిలోల కేక్లను కట్ చేయడానికి సిద్ధం అయ్యారు. లోక్ సభ ఎన్నికల సీట్లను ఆశిస్తున్న వాళ్ల నేతృత్వంలో ఈ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మారథాన్: ఆదివారం ఉదయం నుంచే జన్మదిన సంబరాలు కోలాహలంగా ఆరంభం అయ్యా యి. ఉదయం చెన్నైలో జరిగిన మారథాన్ విజయవంతం అయింది. అన్నాడీఎంకే ఉత్తర చెన్నై నేత బాలగంగ నేతృత్వంలో కార్మిక విగ్రహం నుంచి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వరకు మారథాన్ నిర్వహించారు. ఈ రన్ను మంత్రులు వలర్మతి, చిన్నయ్య, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధు సూదనన్ జెండా ఊపి ఆరంభించారు. రాయపురం, హార్బర్, ఎగ్మూర్, తిరువీకానగర్ పరిసరాల్లోని 35 పాఠశాలల విద్యార్థులు ఈ రన్లో పరుగులు తీశారు. మొదటి విజేతలు కాలేష్, ధరణి లక్ష్మిలకు ఎనిమిది గ్రాముల బంగారం, రెండో విజేత శరత్కుమార్కు ఆరు గ్రాముల బంగారం, మూడో విజేతకు నాలుగు గ్రాములు, మరో 14 మందికి విజేతలకు ఐదు వేలు బహుమతిగా అందజేశారు.