సాక్షి,బెంగళూరు: ఉద్యాన నగరిగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటడం దురదృష్టకరమని టెన్నిస్ క్రీడాకారుడు సోమ్దేవ్ బర్మన్ పేర్కొన్నారు. కస్తూరినగర్లోని నారాయణ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో నటి రెజీనాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమ్దేవ్ బర్మన్ మాట్లాడుతూ...పాఠశాలల్లో చిన్నారులపై జరిగే ఈ తరహా అకృత్యాలు విద్యావ్యవస్థకే తీరని కలంకంగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇంకే చిన్నారి ఇలాంటి అకృత్యానికి గురికాకుండా పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం నటి రెజీనా పాఠశాలలోని చిన్నారులతో కలిసి ముచ్చటించారు. వారితో కాసేపు సరదాగా ఆడిపాడారు. కార్యక్రమంలో కస్తూరి నగర్ నారాయణ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ మాధవి, ఏజీఎం రంగారెడ్డి, డీన్లు నాగేశ్వరరావు, ప్రవీణ్లు పాల్గొన్నారు.