రూ.4 కోట్ల దోపిడీ కేసులో సీఐ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

రూ.4 కోట్ల దోపిడీ కేసులో సీఐ అరెస్ట్

Published Thu, Sep 22 2016 10:07 AM

circle inspector arrested in tamilnadu

ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ పరారీ
 
టీ.నగర్: కోయంబత్తూరు సమీపంలో రూ.3.9 కోట్లు కారులో అపహరించిన కేసులో పరమత్తి ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఎస్‌ఐ శరవణన్, హెడ్ కానిస్టేబుల్ ధర్మేంద్రన్, హవాలా ముఠా నేత కోడాలి శ్రీధర్, అతని కుమారుడు అరుణ్ కోసం గాలిస్తున్నారు. కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతానికి చెందిన అన్వర్ సాదత్(35) నగల వ్యాపారి.
 
ఇతని దుకాణంలో పని చేసే మహ్మద్ (53), ముషీర్ (35), సిదోష్ (32), కారు డ్రైవర్ ఆనంద్ (29) గత నెల 25న చెన్నై నుంచి కోయంబత్తూరు మీదుగా పాలక్కాడు వైపు కారులో వెళుతున్నారు. మదుక్కరై నీలంబూర్ బైపాస్ రోడ్డులో, ఈచ్చనారి వద్ద పోలీసు దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న వారిని దింపి వేసి నగదు సహా కారులో పారిపోయారు.
 
ఆ కారులో రూ.3.9 కోట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై నగల దుకాణం యజమాని అన్సర్ సాదత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ రమ్యభారతి ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి... గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అందులోభాగంగా పోలీసులు త్రిచూర్‌కు చెందిన సుభాష్(42), సుధీర్(33), మలప్పురం ప్రాంతానికి చెందిన సబీక్(28)లను మంగళవారం అరెస్టు చేశారు.
 
వారి వద్ద విచారణ జరపగా దోపిడీలో కరూర్ జిల్లా పరమత్తి ఇన్‌స్పెక్టర్ ముత్తుకుమార్, కుళిత్తలై ఎస్‌ఐ శరవణన్, హెడ్‌కానిస్టేబుల్ ధర్మేంద్రన్‌కు సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ ముత్తుకుమార్ సహా నలుగురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement