'సీఎం కేసీఆర్‌ మోసాల్లో నెంబర్‌ వన్‌' | Sakshi
Sakshi News home page

'సీఎం కేసీఆర్‌ మోసాల్లో నెంబర్‌ వన్‌'

Published Wed, Nov 2 2016 10:31 PM

'సీఎం కేసీఆర్‌ మోసాల్లో నెంబర్‌ వన్‌' - Sakshi

రైతు రుణమాఫీలో విఫలమయ్యారు
శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ
కామారెడ్డి :
సీఎం కేసీఆర్‌ మోసాల్లోనే నంబర్‌ వన్‌ అని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ఆరోపించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ను నంబర్‌వన్‌ సీఎం అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దళితున్ని సీఎం చేస్తానని మోసగించినందుకా, రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని మాట తప్పినందుకా, ఇంటికో ఉద్యోగం అని రెండేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నందుకా..దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకా...మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని మాట నిలబెట్టుకోనందుకా, డబుల్‌బెడ్‌రూం పేరుతో ప్రజలను ఊరించి అన్యాయం చేసినందుకా ఆయన నంబర్‌ సీఎం అని ప్రశ్నించారు. మాటలే తప్ప ప్రజలకు సీఎం కేసీఆర్‌ చేసిందేమి లేదన్నారు.

రైతులకు రుణాలు మాఫీ చేయకుండా అన్యాయం చేసిన సీఎంకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. రైతుల రుణాలు మాఫీ అయ్యేవరకు కాంగ్రెస్‌ పార్టీ రైతుల వెంట పోరాడుతుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అధికారం చేపట్టి రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తుందన్నారు. రైతు గర్జనసభలో మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement