సాక్షి, చెన్నై : సీపీఎం జాబితాను సోమవారం విడుదల చేశారు. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన సీపీఎం జాబితా వెలువడడంతో తమ జాబితాను వెలువరించేందుకు సీపీఐ సిద్ధం అవుతోంది. అన్నాడీఎంకేతో జతకట్టేందుకు యత్నించి చివరి క్షణంలో సీపీఎం, సీపీఐలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొన్నేళ్ల తర్వాత తొలిసారిగా వామపక్షాలు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందు కు సిద్ధం అయ్యాయి. ఒంటరిగా తమ సత్తాను చాటుకోవడం లక్ష్యంగా వామపక్షాలు ఉరకలు తీస్తున్నాయి. తమకు పట్టున్న స్థానాలను రెండు పార్టీలు గత వారం ప్రకటించాయి. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి, ఉత్త ర చెన్నై, దిండుగల్, తిరుచ్చి, విరుదునగర్, విల్లుపురం, తంజావూరుల్లో పోటీకి సీపీఎం నిర్ణయించింది. తెన్కాశీ, నాగపట్నం, పుదుచ్చేరి, తిరుప్పూర్, శివగంగై, ధర్మపురి కడలూరు, తిరువళ్లూరు, తూత్తుకుడిల్లో సీపీఐ పోటీకి నిర్ణయించాయి. రెండు పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుని తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీ అయ్యాయి.
సీపీఎం జాబితా: సోమవారం టీ నగర్లోని పార్టీ కార్యాలయంలో తమ అభ్యర్థుల జాబితాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ప్రకటించారు. కోయంబత్తూరులో పీఆర్ నటరాజన్, మదురైలో పి విక్రమన్, కన్యాకుమారిలో బెలర్మిన్, ఉత్తర చెన్నైలో ఐద్వా నాయకురాలు వాసుకీ, దిండుగల్లో పాండి, తిరుచ్చిలో శ్రీధర్, విరుదునగర్లో కె శామ్యుయేల్ రాజా, విల్లుపురంలో జి ఆనందన్, తంజావూరులో తమిళ్ సెల్వి పోటీ చేస్తారని వివరించారు. మతత్వానికి వ్యతిరేకంగా, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా తమ ఎన్నికల ప్రచారం ఉంటుందని రామకృష్ణన్ తెలిపా రు. జాతీయ కమిటీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుందని, అదే తమ ఎన్నికల అజెండాగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి, తమ పోరాటాల్ని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతామన్నారు. సీపీఎం జాబితా వెలువడడంతో తమ జాబితా ను ప్రకటించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టి.పాండ్యన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే జాబితా సిద్ధమైనప్పటికీ అధిష్టానం ఆమోదంతో మంగళవారం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.