సేలంలో దారుణం | Sakshi
Sakshi News home page

సేలంలో దారుణం

Published Wed, Oct 11 2017 11:05 AM

Daughter in law Murder by Mama

సేలం: సభ్యసమాజం సిగ్గుపడేలాంటి దారుణ సంఘటన సేలం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా లేదనే కోపంతో కోడలిని మామ దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే సేలం జిల్లా మేట్టూరులో విద్యుత్‌ స్టేషన్‌ వెనుకవైపు తురయూర్‌ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పెరియస్వామి (58)కి భార్య ముత్తాయి, కుమారుడు వేల్‌మురుగన్, కుమార్తె మల్లి ఉన్నారు. వేల్‌మురుగన్‌కు వివాహమైంది. అతనికి భార్య అంబిక(24), కుమార్తె జ్యోతిమణి, కుమారుడు శంకర్‌ ఉన్నారు. ఒకే ఇంటిని రెండుగా విభజించి పెరియస్వామి దంపతులు ఒక భాగంలో, వేల్‌మురుగన్‌ కుటుంబంతో మరో భాగంలో నివశిస్తూ వస్తున్నారు.

గత మూడు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలు అంబికపై పెరియస్వామి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె అందుకు అంగీకరించకుండా కేకలు పెట్టి గొడవకు దిగింది. దీంతో స్థానికులు గుమ్మికూడి గ్రామంలో పంచాయితీ పెట్టి పెరియస్వామిని గ్రామస్తులు, అతని కుమారుడు కలసి చితకబాదారు. అతడు తాను తెలియక తప్పు చేశానని, ఇకపై ఇటువంటి పనులు చేయనని ప్రాధేయపడడంతో వదిలి పెట్టారు. ఇలాఉండగా సోమవారం మధ్యాహ్నం పెరియస్వామి మళ్లీ అంబికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో ఆవేశం చెందిన పెరియస్వామి ఇనుప రాడ్‌తో అంబికపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అంబిక  సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అక్కడి నుంచి పెరియస్వామి పరారయ్యాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అంబిక పిల్లలు తల్లి విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
Advertisement