శేఖర్‌రెడ్డికి చెందిన 34 కోట్ల ఆస్తులు అటాచ్‌ | Sakshi
Sakshi News home page

శేఖర్‌రెడ్డికి చెందిన రూ.34 కోట్లు ఈడీ అటాచ్‌

Published Fri, May 5 2017 5:39 PM

ED attaches over Rs 33 crore property of Shekhar Reddy, others

చెన్నై: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము కేసులో  టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో పాటు పలువురి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. సుమారు రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్‌ కింద టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డిసహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డి అతని భాగస్వాముల ఇళ్లు, ఆస్తులపై గత ఏడాది డిసెంబర్‌లో ఆదాయపుపన్నుశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.131 కోట్ల నగదు, ఇందులో రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యత సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఈడీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వాటిని అటాచ్‌ చేసుకుంటున్నట్లు ఈడీ నోటీసులు ఇచ్చింది.

Advertisement
Advertisement