పోటాపోటీ ప్రచారం | Sakshi
Sakshi News home page

పోటాపోటీ ప్రచారం

Published Sat, Apr 12 2014 1:39 AM

elections campaign war

 చైన్నై, సాక్షి ప్రతినిధి: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరీ ఘోరమైన పరిస్థితికి చేరుకుంది. యూపీఏ పాలనతో ఎక్కువ అప్రతిష్టను మూటగట్టుకున్న కాంగ్రెస్‌తో జత కట్టేందుకు ఏ ప్రాంతీయ పార్టీ ధైర్యం చేయలేదు.

అభ్యర్థులకు డిపాజిట్టు దక్కేనా అనే మీమాంసలో పడిపోయిన కాంగ్రెస్‌కు అధిష్టానమే దిక్కైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీల ను ఎన్నికల ప్రచారానికి రప్పించడం ద్వారా లబ్ధి పొం దాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
 
ఈ నెల 16వ తేదీన సోనియా గాంధీ ప్రచారానికి వస్తున్నట్లు సూత్రప్రాయంగా పార్టీ ప్రకటించింది. ఆమె వెళ్లిన తరువాత రాహుల్‌గాంధీ ప్రచారం చేసేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ తొలిసారిగా ఒంటరి పోటీకి దిగిన పరిస్థితుల్లో అభ్యర్థులు గెలుపు సవాల్‌గా మారింది. ఒకవైపు అన్నాడీఎంకే, మరోవైపు బలమైన బీజేపీ కూటమి, వీటితోపాటూ డీఎంకే అభ్యర్థులను అధిగమించి కాంగ్రెస్ గెలుపు సాధించాలంటే సాహసమేనని సొంత పార్టీ నేతలే అనుమానిస్తున్నారు.
 
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏర్పడిన బీజేపీ కూటమి మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మూడు నెలల క్రితం తిరుచ్చిలో నిర్వహించిన మోడీ సభతో బలం పుంజుకున్న బీజేపీ తమ ప్రయత్నం వృథా కారాదని భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లపై దక్షిణాది స్థానాలు కీలకం కానున్న దశలో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. మోడీ రాకతో ఏర్పడిన బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
 
 ఈ క్రమంలో సోనియా, రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చర్చ జరుగుతోంది. వారికి దీటుగా మోడీచేత రెండు ప్రచార సభలు నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. అయితే సోనియా, రాహుల్ వచ్చి వె ళ్లిన తర్వాతనే మోడీని రప్పించాలని బీజేపీ భావిస్తోంది. ఏదైమైనా యూపీఏ, ఎన్‌డీఏకు చెందిన ప్రధానమైన నేతలు ఈ నెలలో రాష్ట్రంలో ప్రచారానికి రావడం గమనార్హం.

Advertisement
Advertisement