సాక్షి, బెంగళూరు: ఐటీ హబ్గా మురిసిపోతున్న బెంగళూరు నగరం.. బాలికల విద్యలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉద్యాననగరిలో దాదాపు 33 శాతం మహిళలు పదో తరగతి వరకు కూడా చదువుకోలేదు. ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, హెల్త్ సర్వే నివేదికలో ఈ వాస్తవం వెల్లడైంది. 2015–16 సంవత్సరంలో 67 శాతం మంది మహిళలు 10వ తరగతి లేదా ఆపై తరగతుల వరకు చదువుకున్నారని సర్వేలో తేలింది.
మిగిలిన 33 శాతం మంది కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో బాలికల విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టారు కానీ ఫలితాలు మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. పేద బాలికలకు భాగ్యలక్ష్మి పథకం ద్వారా చదువుకయ్యే ఖర్చును భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని పేద బాలికలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా చదువు అందించేలా కొత్త పథకాన్ని తీర్చిదిద్దుతోంది.