కోయంబత్తూర్ : బంగారు ఆభరణాలు తయారుదారుని కళ్లలో కారం చల్లి కేజీ బంగారం దోచుకుపోయారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. స్థానిక కెంపట్టి కాలనీలోని ఓ నగల తయారీలో దుకాణంలోకి శనివారం ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఆ సమయంలో దుకాణంలో నాగరాజు అనే ఉద్యోగి ఉన్నాడు. దుండగులు అతన్ని పక్కకు నెట్టేసి బంగారాన్ని ఎతుకుపోయేందుకు యత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు.
దీంతో దుండగులు నాగరాజును తీవ్రంగా కొట్టి, కళ్లలో కారం చల్లారు. అనంతరం కిలో బంగారాన్ని, ఆభరణాలను మూట కట్టుకుని ఉడాయించారు. అనంతరం మరో ఉద్యోగి శరవణకుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని యజమానికి వివరించాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు డాగ్స్క్వాడ్తో సంఘటన స్థలిని పరిశీలించారు. సీసీ ఫుటేజి ఆధారంగా దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.