Sakshi News home page

విశాఖ శివారు భూముల్లో... సర్కారీ దోపిడీ

Published Tue, Jan 31 2017 1:56 AM

విశాఖ శివారు భూముల్లో... సర్కారీ దోపిడీ - Sakshi

విశాఖ నగర శివారులో ఓ మంత్రి భారీ భూ కుంభకోణం

  • రూ.600 కోట్లు కొట్టేసేందుకు వ్యూహం
  • ఏడాది క్రితం చౌకగా పేదల అసైన్డ్‌ భూముల కొనుగోలు
  • అడ్వాన్సులు చెల్లించి అగ్రిమెంట్లుతో పట్టాలు స్వాధీనం
  • రైతులతో ఖాళీ పేపర్లపై సంతకాల సేకరణ
  • ఆనక ల్యాండ్‌ పూలింగ్‌ జీవో జారీ చేయించిన వైనం
  • అగ్రిమెంట్‌దారులు భూములు ఇవ్వొచ్చని జీవోలో మెలిక
  • ఈ జీవో విడుదల వెనుక ‘ముఖ్య’ నేత హస్తం
  • రైతులకు తెలియకుండానే వుడాకు అంగీకార పత్రాలు..
  • వుడా.. రైతుకిచ్చే వాటా ఎకరానికి 1210 గజాలు
  • ఆ వాటా మార్కెట్‌ రేటు రూ.1.80 కోట్ల పైమాటే
  • మంత్రి దళారుల ద్వారా రైతులకు దక్కేది రూ.12 లక్షలే

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేద రైతులకు మాయ మాటలు చెప్పి వారి అసైన్డ్‌ భూముల ద్వారా వందల కోట్లు కొట్టేయడానికి ఓ మంత్రి బరితెగించారు. కారు చౌకగా తన బినామీల ద్వారా ఆ భూములు కొనుగోలు చేసి.. వాటిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చి రూ.600 కోట్లు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించాలన్న ఆలోచనను ఆ మంత్రి తనకు అనుకూలంగా మలుచుకుని వ్యూహ రచన చేశారు. బక్క రైతులను బలి పశువులను చేస్తూ కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకున్నారు.

ఆ తర్వాత గత ఏడాది నవంబర్‌ 14న ల్యాండ్‌ పూలింగ్‌ జీవో (జీవోఎంఎస్‌ నం 290) జారీ చేయించారు. ప్రస్తుత భూ యజమానులు సైతం భూములు ఇవ్వొచ్చని అందులో వారికి అనుకూలంగా మెలిక పెట్టించారు. సాక్షాత్తు సచివాలయం నుంచే ఈ జీవో జారీ కావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం కూడా ఉందని స్పష్టమవుతోంది. అసైన్డ్‌ భూములను ఇతరులు అనుభవించడమే తప్పు. పైగా వాటి క్రయ విక్రయాలు చెల్లవు. అలాంటిది ఏకంగా 358 ఎకరాలను కొనుగోలు చేశారంటే ప్రభుత్వ పెద్దలతో ముందే మాట్లాడుకుని కథ నడిపించారనేది స్పష్టమవుతోంది. విశాఖలో వుడా ల్యాండ్‌ పూలింగ్‌ పథకం అమలు ఊసెత్తకముందే జిల్లాకు చెందిన ఓ మంత్రి ముందస్తు వ్యూహరచన చేశారు. పక్కా పథకం ప్రకారం.. ఎక్కడెక్కడ వుడా భూములు సేకరిస్తుందో అక్కడ ఏడాది క్రితమే తన బినామీలు, అనుచరులతో పాగా వేయించారు.

ప్రధానంగా నగర శివారులోని భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్‌)డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని డీ పట్టా భూములు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములు ఎకరాకు రూ.3 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఆ మేరకు రైతులకు అడ్వాన్సుగా రూ.2 లక్షలు చొప్పున చెల్లించి క్రయ పత్రాలు (అగ్రిమెంట్‌) రాయించుకున్నారు. వాటితో పాటు ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని వాటన్నింటినీ తమ వద్దనే ఉంచుకున్నారు. ఇదంతా పూర్తి అయ్యాక సదరు మంత్రి ముఖ్యమంత్రి అండతో ల్యాండ్‌ పూలింగ్‌కు రంగం సిద్ధం చేయించారు.

ప్రతిపాదిత గ్రామాలనే మార్చేసిన మంత్రి
వుడా మొదట శొంఠ్యాంలో 14 ఎకరాలు, కొత్తవలసలో 45 ఎకరాలు, మామిడిలోవలో 19, నేరేళ్లవలసలో 28, రామవరంలో 59, గంగసాని ఆగ్రహారంలో 78, గోరింటలో 24, కాపులుప్పాడలో 18, పైడివాడలో 135, పైడివాడ అగ్రహారంలో 35, ముదపాకలో 315, బయ్యవరంలో 210, గండిగుండంలో 69, గిడిజాలలో 35  ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన గ్రామాలు లేకపోవడంతో మంత్రి రంగంలోకి దిగి సౌభాగ్యరాయపురం (పెందుర్తి మండలం), దబ్బంద, గండిగుండం (ఆనందపురం మండలం), కొమ్మాది (విశాఖపట్నం రూరల్‌), నేరేళ్లవలస (భీమునిపట్నం మండలం) గ్రామాలను అదనంగా చేర్పించారు.

భూ సమీకరణ కోసం వుడా ఎంపిక చేసిన భూములు
► తొలి విడతగా సౌభాగ్యరాయపురంలో 116/1, 121/1,2, 123/2, 124/1,2, 125/1,2, 99 సర్వే నెంబర్లలోని 60.94 ఎకరాల అసైన్డ్‌ భూమి, 68 ఎకరాల ప్రభుత్వ భూమి.
► దబ్బందలో సర్వే నంబర్లు 14/1, 19/2,20, 24/1 నుంచి 4 వరకు, 140/3 నుంచి 6 వరకు, 141/1 నుంచి 8 వరకు,  143/1 నుంచి 4 వరకు, 144/1 నుంచి 4 వరకు, 145/2 నుంచి 10 వరకు, 146/1 నుంచి 7,9,10 వరకు, 147/1 నుంచి 4 వరకు, 148/1 నుంచి 14 వరకు గల సర్వే నంబర్లలోని 25.88 ఎకరాల జిరాయితీ భూములు, 65.35 ఎకరాల అసైన్డ్‌ భూములు, 23 ఎకరాల ప్రభుత్వ భూములు.
► కొమ్మాదిలో సర్వే నంబర్లు 38, 42, 28/2, 39/2, 40/1 నుంచి 3 వరకు, 53/1ఎ,2,3,4ఎ,5,6ఎ,7, 54/1ఎ,2ఎ, 3ఎ,4ఎ,5ఎ,6, 161/1,2, 162/1,2, 163/1నుంచి 3 వరకు, 40/1బి, 136, 40/1సి, 151/2,4, 152/1,2, 153/1 లలో 39.80 ఎకరాల జిరాయితీ, 48.84 ఎకరాల డీ పట్టా భూములు, 28 ఎకరాల ప్రభుత్వ భూమి.
► రెండో విడతలో భీమునిపట్నం మండలం నేరేళ్లవలసలో సర్వే నంబరు 49/1పిలో 114.34 ఎకరాల అసైన్డ్‌ భూమి.
► ఆనందపురం మండలం గండిగుండంలో సర్వే నంబర్లు 16/2 నుంచి 25/6, 36/1 నుంచి 4 వరకు గల 69 ఎకరాల అసైన్డ్‌ భూమి.
► మొత్తంగా రెండు విడతల్లో  543.15 ఎకరాలను సేకరిస్తున్నట్టు వుడా ప్రకటించింది. అందులో మొదటి విడతలో 175.13 ఎకరాల అసైన్డ్‌ భూములు, రెండో విడతలో 183.34 ఎకరాల అసైన్డ్‌ భూములు కలిపి మ్తొతం 358.47ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధమైంది. జిరాయితీ, ప్రభుత్వ భూములను పక్కనపెట్టి మంత్రి ముందుగా అసైన్డ్‌ భూములను సొమ్ము చేసుకునేందుకే పావులు కదిపారు.

మంత్రి వ్యూహం సక్సెస్‌
ల్యాండ్‌ ప్యూలింగ్‌ కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్లాట్లు ఇస్తామని వుడా ప్రకటించడంతో మంత్రి ముందస్తు పథకం విజయవంతమైంది. భూములు అందించిన రైతులకు వాటా కింద జిరాయితీ అయితే ఎకరాకు 1410 చదరపు గజాలు, అసైన్డ్, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందించిన భూములైతే ఎకరాకు 1210 చదరపు గజాల చొప్పున ఇస్తామని వుడా స్పష్టం చేసింది. రైతుల ఆక్రమణలో ఉండి, అభ్యంతరం లేని ప్రభుత్వ భూములకైతే 500 గజాలు, అభ్యంతరం ఉన్న భూములకైతే 250 గజాలు చొప్పున అందిస్తామంది. కాగా, బినామీలతో రైతుల నుంచి మంత్రి క్రయ ఒప్పందాలు చేసుకున్న అసైన్డ్‌ భూమి 358.47 ఎకరాల వరకు ఉంది.

ల్యాండ్‌ ప్యూలింగ్‌కు ప్రతిపాదించిన ఈ భూముల్లో చదరపు గజం ధర కనీసం రూ.15 వేల వరకు ఉంది. ఈ లెక్కన రైతుల నుంచి మంత్రి ఓ ఎకరాకు తీసుకునే 1210 చదరపు గజాల స్థలం విలువ రూ.1.80 కోట్లు. మొత్తం 358 ఎకరాలకు లెక్క వేస్తే రూ.600 కోట్లపైనే ఉంటుంది. కానీ రైతులకు ఏడాది క్రితం చెల్లించిన మొత్తం విలువ రూ.40 కోట్లకు మించదు. అంటే ఏడాది క్రితం సుమారు రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టి రైతులను నిలువునా ముంచేసి భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి, ప్రభుత్వ పెద్ద.. సంపాదించిన మొత్తం సొమ్ము సుమారు రూ.600 కోట్లన్న మాట.

రైతులకు తెలియకుండానే వుడాకు అంగీకార పత్రాలు?
కాగా, రైతుల వద్ద ముందుగానే సంతకాలు చేయించి తీసుకున్న ఖాళీ పేపర్ల పై ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ విన్నపాలను తయారు చేసి బినామీలే వుడాకు సమర్పించారు. అధికారులు అందుకు అంగీకరించి భూ సేకరణకు సంబంధించిన సర్వే నంబర్లను బహిర్గత పరిచారు. వాస్తవానికి ప్రభుత్వం ఏవైనా అవసరాల కోసం భూములను సేకరించినప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా చర్చించి వారి అంగీకారంతో సేకరణ చేపట్టాలి. కానీ ఇక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా వుడా ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తుండటం గమనార్హం. పైగా రైతులకు అడ్వాన్సులిచ్చి అగ్రిమెంట్లు రాయించుకోవడం ద్వారా మంత్రి బినామీలు ఆయా భూములు, ప్లాట్లకు యజమానులయ్యారు. తద్వారా ప్లాట్‌ యజమానులు కూడా భూములు ఇవ్వొచ్చని పేర్కొనడంతో ఎదురు లేకుండా పోయింది.

అక్రమాలకు ఊతమిస్తున్న జీవో!
వుడా ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 290 అక్రమాలకు తెరలేపే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి డి–ఫారం పట్టా భూములు అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవు. కానీ ఇక్కడ డీ–ఫారం పట్టా భూముల వ్యవహారంలో కొనుగోలుదార్లకు వీలుకల్పిస్తు జీవోలో వెసులుబాటు కల్పించింది. ల్యాండ్‌ అలాట్‌ అయిన 30 రోజుల లోపు డి–ఫారం పట్టా భూమి యజమాని సంబంధిత అథారిటీ ల్యాండ్‌ పూలింగ్‌ ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ను (ఫారం 11లో) ఇవ్వాలి. అలా ఫారం–11లో పేర్కొన్న వ్యక్తి ఓనర్‌షిప్‌కు అర్హుడవుతాడు. ఆ ఓనర్‌షిప్‌ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ ఆ వ్యక్తి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి రికార్డుల్లో నమోదు చేస్తుంది.’  రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా మంత్రి కోసం ప్రభుత్వం ఇలాంటి జీవోను జారీ చేయడం, అందులో అక్రమంగా డి–ఫారం పట్టా భూములకు హక్కు పొందేలా వెసులుబాటు కల్పించడం విశేషం.

Advertisement

What’s your opinion

Advertisement