నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమిరెడ్డిపై చేసిన ప్రతి ఆరోపణని ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. అక్రమ ఆస్తులపై నేరుగా సమాధానం ఇవ్వకుండా సోమిరెడ్డి డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. విదేశాల్లో సోమిరెడ్డి పెట్టుబడులపై త్వరలోనే కేంద్రానికి కూడా ఓ లేఖ రాస్తానని చెప్పారు.
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సింగపూర్, మలేషియా, హాంకాంగ్తో సహా పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి ఇదివరకే ఆరోపించారు. ఆయన పలు విదేశీ సంస్థలతో లావాదేవీలు చేశారన్నారు. తరచు తాను పేదవాడినని చెప్పుకొనే సోమిరెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమిరెడ్డి లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.