సోదరిపై ఎనిమిదేళ్లుగా అత్యాచారం | Sakshi
Sakshi News home page

సోదరిపై ఎనిమిదేళ్లుగా అత్యాచారం

Published Sun, Apr 27 2014 10:50 PM

Gurgaon doctor sent to custody for raping sister

గుర్గావ్: అర్ధరాత్రిరోడ్డు మీదనో, ఆఫీసులోనో కాదు.. సొంతింట్లో కూడా రక్షణ లేకుండా పోయింది అమ్మాయిలకు. కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు అన్న తేడా లేకుండా చెలరేగిపోతున్నారు కామాంధులు. అతనో డాక్టర్. మనుషుల ప్రాణాలను నిలబెట్టాల్సినవాడు. కానీ మానవత్వం మరిచి సమాజమంతా అసహ్యించుకునే పని చేశాడు. గుర్గావ్‌కు చెందిన 32 ఏళ్ల  రాజేశ్‌కుమార్ ఎనిమిదేళ్లుగా తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారం చేస్తున్నాడు. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం డ్యూటీ మేజిస్ట్రేట్ జోగిందర్ సింగ్ ముందు హాజరు పరిచారు. విచారించిన ఆయన 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. 27 ఏళ్ల బాధితురాలు ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలోని సమాచార విభాగంలో పనిచేస్తోంది. తన సోదరుడి ఘాతుకంపై ఆమె శనివారం మేన్సార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
 బయటకు తెలిస్తే తనకు, తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందేమోనని భయపడే ఇన్నేళ్లపాటు ఆ గాయాలను భరించానని ఆమె పోలీసులకు తెలిపింది. తన సోదరుడు 2005లో తాను 12వ తరగతిలోఉండగానే మొదటిసారి తనపై లైంగికంగా దాడి చే శాడని, ఎవరికీ చెప్పుకోలేక వెంటనే తన సోదరి ఇంటికి వెళ్లిపోయానని బాధితురాలు పేర్కొంది. అయితే తల్లిని చూడడానికి ఇంటికి వచ్చిన ప్రతిసారీ తనకో విషమ పరీక్షే ఎదురయ్యేదని పోలీసులకు తెలిపింది. గుర్గావ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం వీరిది. ఐదుగురు అక్కాచెల్లెళ్లున్న ఆ కుటుంబంలో ఏకైక కొడుకు రాజేశ్‌కుమార్. అతనిపై అత్యాచారం, దాడి, బెదిరించిన నేరాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ మహిళ వైద్య పరీక్షలకు వెళ్లడానికి నిరాకరించింది.
 

Advertisement
Advertisement