చరిత్ర శిథిలం..! | Sakshi
Sakshi News home page

చరిత్ర శిథిలం..!

Published Tue, Sep 20 2016 1:09 PM

చరిత్ర శిథిలం..!

  కాలగర్భంలోకి చారిత్రక కట్టడాలు
  గతమెంతో ఘనం.. ప్రస్తుతమంతా శూన్యం
  పట్టించుకోని అధికారులు.. పాలకులు
 
నిర్మల్‌రూరల్ : నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని  నింపుకున్న ఈ ఊరిలోనా ఎన్నో విశేషాలున్నాయి. భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశించిపోయూడు. ఇక్కడి స్థల విశేషాన్ని గుర్తించి స్థిరపడ్డాడు. అలా.. పన్నెండిళ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులు తవ్వించి, కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పర్చారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్‌గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి నేడు ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్దాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులూ ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్‌లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం పోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతున్నారుు. ఏళ్లుగా వాటిని కనీసం పట్టించుకోని అధికారులు.. పాలకులే ఇందుకు కారణం.
 
గఢ్.. గఢ్‌కో చరిత్ర..
నిర్మల్ అంటే కోటలు, గఢ్‌లకు ప్రసిద్ధి. అందులో ఒక్కో గఢ్‌కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్‌గఢ్ ఆ రోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్‌లో ఒకదానికొకటి ఆనుకుని 32 గదులను నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్‌గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. శ్రీనివాస్‌రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్‌లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వ సైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్‌గా పేరుపెట్టినట్లు చెబుతారు. పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది.
 
దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్‌కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నంబరు జాతీయరహదారి వెళ్తోంది. బంగల్‌పేట్ శివారులో ధం-ధంగఢ్, వెంకటాద్రిపేట్‌లో మరోగఢ్, బత్తీస్‌గఢ్ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్ నిర్మించారు. పట్టణంతోపాటు మండలంలోని సోన్ సమీపంలో సోన్‌గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్‌లను శ్రీనివాసరావు నిర్మింపజేశారు. బంగల్‌పేట్‌లో గల బంగల్‌చెరువు కింది భాగంలో కందకం పొడవునా గఢ్‌లు ఉన్నాయి. ఇలా నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64 గఢ్‌లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయంతో శ్రీనివాస్‌రావు నిర్మింపజేసినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్‌పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఇక ఈగఢ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండడం. 
  
నిమ్మల.. ఓ మినీ ఓరుగల్లు
ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిర్మల్‌ను నిమ్మల పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీ నిర్మించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వీటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తై బురుజులను నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట)ను కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్‌లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళక ళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలను, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లను కట్టుకున్నారు. 
 
మంటలు వేసి తెలిపేవారు..
ఈగఢ్‌లను ఎత్తై గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. అలాగే పట్టణం పైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్‌గఢ్‌పై గల సైనికులు గుర్తించేరు. వెంటనే వారు అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్‌పై గల సైనికులు గమనించేవారు. వెంటనే వారు మంటలను రాజేసేవారు. వాటిని బత్తీస్‌గఢ్‌పై గల సైనికులు గమనించి, వారు కూడా మంటలు పెట్టేవారు. ఈగఢ్‌పై పెట్టిన మంటలు పట్టణం మధ్యలో గల ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. అక్కడ ఉండే సైన్యాధికారులు, పాలకులు మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమయ్యేవారు. ఇలా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో మంటలు, పొగల ద్వారా తమ శత్రురాకను నిర్మల్ పాలకులు గుర్తించేవారు.
 
పక్కాగా పట్టణ నిర్మాణం..
నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారు. ఇందుకు ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే ఉదాహరణ. ఇవి రక్షణకేగాక పచ్చని పంటలను పండించేందుకు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడేవి. ఇక నిమ్మల ఊరిని సైతం పక్కాగా నిర్మించారు. ఊరి చుట్టూ ప్రహరీతోపాటు పొలిమేరల్లో పట్టణంలోకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట గొలుసులతో మార్గాన్ని మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్‌గేట్ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటి కారణంగా దీనికి చైన్‌గేట్ అనే పేరొచ్చింది. బంగల్‌పేట్ శివారులోనూ ఇలా రోడ్డుకిరువైపులా బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారిపోయింది.
 
 ఇదంతా గతవైభవమేనా..
 గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్ కోటలను నాటి పాలకులు నిర్మించారు. కానీ.. నేటి పాలకుల పట్టింపులేనితనంతో ఇవి వెలుగులోకి రాలేదు. దీంతో ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్‌ను అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలావస్థలకు చేరింది. శ్యాంగఢ్‌కు ఓవైపు మాత్రమే డంగుతో పూతలు పూసి వదిలేశారు. లోపల కోటగోడలు కూలుతున్నాయి. అందులో ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా విరిగిపోయాయి. ఇక బత్తీస్‌గఢ్ చుట్టూ గుట్టలపై క్వారీలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం చేపట్టే పేళ్లుళ్ల ధాటికి గఢ్ గోడలు బీటలు వారుతున్నాయి. రోడ్డు వెడల్పులో చైన్‌గేట్‌ను ఓవైపు నామరూపాల్లేకుండా కూల్చేశారు. ఇప్పుడక్కడ కందకంతో సహా ఆక్రమణలకు గురవుతోంది. 
 
 
ఇప్పటికైనా దృష్టిపెట్టాలి..
ఒకప్పటి నిమ్మలరాజ్యం ఇప్పుడు నిర్మల్‌జిల్లాగా అవతరించబోతోంది. ఎప్పుడూ రాజకీయకేంద్రంగానే పేరున్నా.. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. పర్యాటక అభివృద్ధి పుష్కలమైన అవకాశాలున్నాయి. కానీ పట్టించుకునే నాథుడు లేడు. నిన్నగాక మొన్న వినాయకుల నిమజ్జనం కోసం బంగల్‌చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. దీంతో ఉన్నవాటిని కాపాడడం తెలియదు కానీ.. చరిత్రను కనుమరుగు చేయడం మన పాలకులకు బాగా తెలుసని నిర్మల్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేయకున్న ఫర్వాలేదు కానీ.. మన చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడంటూ మొరపెట్టుకుంటున్నారు.
 
 
 

Advertisement
Advertisement