ఇక మేం బతకలేం.. | Sakshi
Sakshi News home page

ఇక మేం బతకలేం..

Published Thu, Sep 26 2013 3:52 AM

Husband's death, including a mother with a son's suicide

బెంగళూరు, న్యూస్‌లైన్ : అందమైన జీవితం... సాఫీగా సాగుతున్న కుటుంబంలో పెను తుఫాను... రోడ్డు ప్రమాదంలో గాయపడిన భర్త చనిపోయాడని పిడుగులాంటి వార్త... మీరు లేని జీవితం మాకెందుకు అంటూ ఆ ఇల్లాలు కుమారుడితో సహా విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన న గరంలో సంచలనం సృష్టించింది. వివరాలు... న గరంలోని కళ్యాణ నగరలోని శక్తిగార్డెన్‌లో జ్ఞానశేఖర్ (46), చైత్రా (38) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ప్రభాకర్ డిప్లోమా చదువుతుండగా, ప్రవీణ్ పీయూసీ, జీవన్ ఆరో తరగతి చదువుతున్నారు.

జ్ఞాన శేఖర్‌కు లేత్ ఫ్యాక్టరీ ఉంది. అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఈ నెల 7న రోడ్డుపై నడచి వెళ్తుండగా జ్ఞాన శేఖర్‌ను బైక్ ఢీకొట్టింది. అప్పటి నుంచి అతను ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. తలకు గాయం కావడంతో శస్త్ర చికిత్స చేశారు. మృత్యువుతో పోరాడుతూ జ్ఞానశేఖర్ బుధవారం వేకువజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చైత్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భర్త లేడనే క్షణికావేశంలో కుమారుడు జీవ న్‌కు విషం తాగించి తానూ తాగింది.

ఉదయం చైత్ర పెద్ద కుమారుడు ప్రభాకర్ విషయం గుర్తించి తల్లి, తమ్ముడిని సమీపంలోని పనేషియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారి ప్రాణాలను కాపాడటానికి శతవిధాల ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వారు మృతి చెందారని కామాక్షి పాళ్య పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మృతదేహాలను బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో జ్ఞానశేఖర్ ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement