బిల్‌ కలెక్టర్‌నూ వదలని ఐటీ అధికారులు | Sakshi
Sakshi News home page

బిల్‌ కలెక్టర్‌నూ వదలని ఐటీ అధికారులు

Published Fri, Aug 4 2017 8:37 PM

IT raids on Karnataka minister DK Shivakumar continue

మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలోని ఇట్టిగెగూడులోనున్న ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్‌ మామ తిమ్మయ్య ఇంట్లో శుక్రవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఇంట్లో లభించిన పత్రాలు, బిల్లులపై ఐటీ అధికారుల ప్రశ్నలకు తిమ్మయ్య సమాధానాలిచ్చారు. ఇప్పటికే తిమ్మయ్య అన్ని లావాదేవీలను స్తంభింపచేసిన ఐటీ అధికారులు.. నగరంలోని జేపీ నగర్‌లోనున్న తిమ్మయ్యకు చెందిన శీకాయపొడి తయారీ ఫ్యాక్టరీని తాత్కాలికంగా సీజ్‌ చేశారు.

తనిఖీలు జరుగుతున్న సమయంలో తిమ్మయ్య ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఈ సమయంలో తిమ్మయ్య ఇంటికి విద్యుత్‌ బిల్లు ఇవ్వడానికి వచ్చిన బిల్‌ కలెక్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతించారు. మూడు రోజుల క్రితం మంత్రి ఇంటిపై ఐటీ దాడులు చేసిన విషయం విదితమే.

Advertisement
Advertisement