ఉత్తమ విలన్‌కు తొలగిన అడ్డంకులు | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్‌కు తొలగిన అడ్డంకులు

Published Sun, May 3 2015 3:57 AM

ఉత్తమ విలన్‌కు తొలగిన అడ్డంకులు - Sakshi

 టీనగర్:ఉత్తమ విలన్ చిత్రానికి అడ్డంకులు తొలగినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, దర్శకుడు, నిర్మాత లింగుసామి తెలిపారు. నటుడు కమలహాసన్, దివంగత దర్శకుడు కె.బాలచందర్, పూజాకుమార్, ఆండ్రియా నటించిన చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని లింగుసామి తిరుపతి పిక్చర్స్, కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. మొదట్లో ఉత్తమ విలన్ మే ఒకటవ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారమే తెరపైకి వచ్చింది.
 
 అయితే తమిళనాడులో చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల సొమ్మును థియేటర్ల యజమానులు తిరిగి చెల్లించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడమే చిత్రం విడుదలలో చిక్కులు ఏర్పడినట్లు సమాచారం. ఇలావుండగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, లింగుసామి శనివారం విలేకరులతో సమావేశమయ్యారు.
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలన్ చిత్రానికి వ్యాపార రీత్యా ఏర్పడిన కొన్ని సమస్యలతో విడుదలకు జాప్యం జరిగిందన్నారు.చిత్రం విడుదలలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. చిత్రం విడుదలలో జాప్యానికి లింగుసామి క్షమాపణ కోరారు. 27 గంటల చర్చల తర్వాత ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. ఈ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు అరుళ్‌పతి, అన్బు సెలియన్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement