ప్రేమికుల బలవన్మరణం | Sakshi
Sakshi News home page

ప్రేమికుల బలవన్మరణం

Published Wed, Mar 2 2016 3:17 AM

ప్రేమికుల బలవన్మరణం

బళ్లారి (తోరణగల్లు) : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని పురుగుల మందు తాగి ప్రేమికులు బలవన్మరణం పొందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పీడీహళ్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దేవీనగర్‌కు చెందిన ప్రవీణ్(21)డిప్లమో పూర్తి చేసి సీసీ కెమేరాలు అమర్చే షాపులో పని చేస్తున్నాడు. వీవీ సంఘం కళాశాలలో డిప్లమో ఫ్యాషన్ డిజైనింగ్ బ్రాంచ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన ప్రియాంక(18)ను ప్రేమించాడు.
 
 గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చేళ్లగుర్కి వద్ద గల రూపనగుడి రోడ్డులోకి చేరుకుని సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగారు. పురుగుల మందు ప్రభావంతో ప్రవీణ్ వెంటనే మృతిచెందాడు. ప్రియాంక అస్వస్థతకు గురైంది. స్థానికులు గమనించి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ప్రియాంక కూడా సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై పీడీ హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
 ప్రియుడుతో గొడవ... ప్రియురాలి  బలవన్మరణం
 బెంగళూరు(బనశంకరి) :  ప్రియుడితో గొడవపడిన ఇంజనీరింగ్ విద్యార్థిని నాలుగు అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహదేవపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ... బి.నారాయణపుర కు చెందిన నేహా (22) ఇక్కడి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది.
 
 ఇటీవల ఈమె తల్లి మృతి చెందడంతో ఇంటిలో ఉంటోంది. నేహా స్నేహితుడు విఘ్నేష్‌ను ప్రేమిస్తోంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో నేహా సోమవారం రాత్రి విఘ్నేష్ నివాసముంటున్న డీఆర్‌డీఓ క్వార్టర్‌కు వెళ్లి అతనితో గొడవపడి పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహదేవపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement