శివమొగ్గ, స్థానిక ప్రభుత్వ మగ్గాన్ ఆస్పత్రిలో ఆడశిశువును విక్రయించారు. బాలింత, ఆమె తల్లి కలిసి రూ. ఆరు వేలకు నెల రోజుల పసికందును విక్రయించారు. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే... దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా సవళంగ సమీపంలోని కూడతాళ తండాకు చెందిన నాగిబాయి(27) 25 రోజుల క్రితం అక్కడి తాలూకా ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. వారం రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆమెను మగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు తోడుగా తల్లి సోమ్లిబాయి ఉంటున్నారు. మగ్గాన్ ఆస్పత్రిలోని శరావతి వార్డులో ఉంటున్న వీరు గుర్తు తెలియని మహిళ వద్ద నుంచి ఆదివారం మధ్యాహ్నం రూ. ఆరు వేలు తీసుకుని శిశువును అప్పగించారు.
విషయాన్ని పక్క బెడ్పై ఉన్న రోగులు గుర్తించి ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు. దీంతో ఆస్పత్రి పాలక మండలి ఫిర్యాదు మేరకు దొడ్డపేట పోలీసులు అక్కడకు చేరుకుని తల్లీకూతుళ్లను విచారణ చేశారు. సోమవారం ఉదయం తిరిగి ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సోమ్లీబాయిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నాగిబాయి ఇద్దరు ఆడపిల్లలు, ఓ మగబిడ్డకు జన్మనిచ్చిందని, వీరిని కూడా అప్పట్లో వీరు విక్రయించినట్లు వెలుగు చూసింది.
ఈ విషయంపై నాగిబాయిని ప్రశ్నిస్తే తనకు తెలియకుండా తల్లీ ఈ పనిచేసిందని విలపించింది. అదే సమయంలో సోమ్లిబాయి మాట్లాడుతూ... తన కూతురి అభీష్టం మేరకే విక్రయించినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శిశువు విక్రయంలో ఇద్దరి హస్తమున్నట్లు తెలుస్తోంది.