అప్పుడే పుట్టిన కవలల్ని చంపేసి... | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టిన కవలల్ని చంపేసి...

Published Mon, May 23 2016 9:21 AM

అప్పుడే పుట్టిన కవలల్ని చంపేసి... - Sakshi

టీనగర్: వివాహేతర సంబంధంతో అప్పుడే పుట్టిన ఇద్దరు మగపిల్లలను ఓ తల్లి చంపిన ఘటన తిరుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత తల్లికి కూడా ఫిట్స్ రావడంతో ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్లితే కొళత్తుపాళయం సమీపంలోని కృష్ణాపురానికి చెందిన శివకామి(37)కి 19 ఏళ్ల క్రితం రామసామితో వివాహమైంది. వీరికి దివ్య(16) అనే కూతురు ఉంది. అయితే కొన్నాళ్లకు రామసామి మృతి చెందడంతో కుమార్తె దివ్యను పుట్టింట్లోనే వదిలిపెట్టి వెల్లావిపుదూరుకు చెందిన షణ్ముగాన్ని శివకామి రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక మగబిడ్డ జన్మించడంతో అతనికి శంకర్ అనే పేరు పెట్టారు. అతనికి ప్రస్తుతం ఆరేళ్లు. కొన్నాళ్లకు షణ్ముగం కూడా మృతిచెందాడు. దీంతో ఆమె శంకర్‌ను షణ్ముగం తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి కరయూరు సమీపంలో గల ఒక తోటలో పనికి కుదిరింది.

ఈ క్రమంలోనే శివగామి మళ్లీ గర్భవతి అయింది. నిండు చూలాలైన ఆమెకు తరచూ ఫిట్స్ వచ్చేవి. పురిటినొప్పులు రావడంతో అటవీప్రాంతం సమీపంలోని పొదల్లో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. ఈ పిల్లలకు తండ్రి ఎవరని అడుగుతారనే భయంతో ఆమె బిడ్డలను హతమార్చినట్లు సమాచారం. అదే సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement