ప్యారిస్, న్యూస్లైన్ : భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసే రీతిలో సినిమా థియేటర్ల లోపల, బయట నిఘా కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని పోలీసు శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో భద్రతా చర్యలను పెంపొందించే రీతిలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ స్థితిలో కమిషనర్ కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులతో బుధవారం సమావేశమయ్యూరు. అదనపు కమిషనర్ రాజేష్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 50కి పైగా థియేటర్ల యజమానులు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని సూచనలు చేశారు. చెన్నైలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు పూర్తి భద్రతతో ఉన్నాయని యజమానులు హామీ ఇవ్వాలి.
అందరినీ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ జరిపిన తర్వాతనే థియేటర్ లోపలికి అనుమతించాలి. వారు తీసుకు వచ్చే హ్యాండ్ బ్యాగు, వస్తువులను వేరుగా స్కానింగ్ చేసి, తనిఖీ చేయాలి. కార్లు, బైకులను పార్కింగ్ చేసే ముందు తనిఖీ చేయాలి. పార్కింగ్ చేసే సమయంలో వాటి నెంబర్లు కనిపించే రీతిలో కెమెరాలను అమర్చాలి. సినిమా థియేటర్ల లోపల మాత్రమే కాకుండా వెలుపలి వైపున కూడా నిఘా కెమెరాలను అమర్చాలి. థియేటర్ లోపల అనుమానంగా ఉండే ఏవైనా వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్న విషయం తెలిపే రీతిలో తెరపై ప్రకటనలను ప్రదర్శించాలి. థియేటర్లోపల టికెట్లు ఇచ్చే ప్రాంతం, క్యాంటిన్లలో కూడా నిఘా కెమెరాలు పెట్టాలి. ఇలాంటి సూచనలతో ఉత్తర్వులను పోలీసు అధికారులు జారీ చేశారు.