పండగొస్తోంది.... జీతం కావాలంటోంది.! | Sakshi
Sakshi News home page

పండగొస్తోంది.... జీతం కావాలంటోంది.!

Published Wed, Oct 5 2016 8:33 AM

పండగొస్తోంది.... జీతం కావాలంటోంది.!

  • అష్టకష్టాలు పడుతున్న కేజీహెచ్ కాంట్రాక్ట్ సిబ్బంది
  • ఆరు నెలలుగా జీతాలు బంద్  
  • సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, నర్సుల పస్తులు
  • పట్టించుకోని కాంట్రాక్టర్లు
  •  
    ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదారుుని కేజీహెచ్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది పస్తులుంటున్నారు. ఆర్నెల్లగా జీతాలు అందక పోవడంతో పిల్లలకు స్కూళ్ల ఫీజులు కట్టలేక, రేషన్, ఇంటి అద్దెలు చెల్లించలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టర్ కూడా వీరిని పట్టించుకోవడం లేదు. కనీసం చాలా మంది సిబ్బందికి కాంట్రాక్టర్ కూడా ఎవరో తెలియదు.

    సూపర్‌వైజర్లే  మొత్తం కథ నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీస వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించాలి. ఆరు నెలలుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ నంబర్లు కూడా రాలేదు. ఒకవేళ మధ్యలో ఉద్యోగం వదలి వెళ్లిపోతే.. ఇంతకాలం పనిచేసిన కాలానికి జీతం చెల్లించరని వాపోతున్నారు. మరో వైపు పండగొస్తోంది. జీతాలు లేక ఎలా పండగ జరుపుకోవాలని వారంతా ఆవేదన చెందుతున్నారు.  
     - కేజీహెచ్
     
     
     ఇదీ పరిస్థితి..
     కేజీహెచ్‌లో జేబీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో 172 మంది గార్డులు, సూపర్ వైజర్లు పనిచేస్తున్నారు. కొత్తగా నిర్వహణ బాధ్యతలను తీసుకున్న ఈ సంస్థ 12 శాతం తక్కువకు పనులను చేజిక్కించుకుం ది. మే నుంచి గార్డులను సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి నేటి వరకు గార్డులకు జీతం కింద చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. కాంట్రాక్టు తీసుకున్నప్పుడు పని చేస్తున్న వారికి ఒకటి లేదా రెం డు నెలల జీతాలు ముందుగా కాంట్రాక్టర్ చెల్లించాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో వారిని పట్టించుకున్న నాథుడే లేడు.
     
     హౌస్ కీపింగ్ కింద కేజీహెచ్‌లో 230 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ముంబైకి చెందిన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వీరికి కూడా గడిచిన నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. వీరికి ప్రతినెలా రూ.41.92 లక్షల జీతాలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు పాసైతే వీరికి జీతాలు. లేదంటే ఎన్ని నెలలు అరుునా పస్తులుండాల్సిందే.  
     
     ఈ ఏడాది మార్చి నుంచి కాంట్రాక్టు పద్ధతిలో 160 మంది వరకు నర్సులను విధుల్లోకి తీసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు రెండు నెలల జీతాలు మాత్రమే అందాయి.   
     ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రతి నెల 11న జీతాల బిల్లులు పెడితే.. ట్రెజరీ నుంచి విడుదలయ్యే నిధులను సిబ్బంది అకౌంట్‌కు జమ చేయాలి. ఈ రెండు సంస్థలు సకాలంలో బిల్లులు పెట్టడం లేదని వైద్యాధికారులు తెలిపారు. వారు బిల్లులు పెట్టకపోతే జీతాల నిధులు ఎలా మంజూరు చేస్తామని చెబుతున్నారు.  
     
     ఈఎస్‌ఐ, పీఎఫ్ దేవుడెరుగు!
     కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు చెల్లించాలి. వారి పేర్ల మీద అకౌంట్లు తెరచి, సొమ్ములను జమ చేయాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో ఏ కార్మికుడికి కూడా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కార్మిక శాఖ అధికారులు ఆరా తీసిన దాఖలాలు కూడా లేవు. అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదని కాంట్రాక్ట్ సిబ్బంది వాపోతున్నారు.  
     
     జీతాలు చెల్లించాలని కోరుతున్నాం
     కేజీహెచ్‌లో పనిచేస్తున్న నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాం.  
     - భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు,
     ప్రభుత్వ నర్సుల సంఘం  
     
     సకాలంలో జీతాలు చెల్లించాలి
     కేజీహెచ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం.  
     - శ్రీను, ఐఎన్‌టీయూసీ నాయకుడు  
     
     జీతాలు చెల్లిస్తాం  
     కేజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లలు సకాలంలో బిల్లులు పెట్టకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం.  
     - డాక్టర్ అర్జున్,
     సూపరింటెండెంట్, కేజీహెచ్

Advertisement
Advertisement