తాడేపల్లిగూడెం: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ విగ్రహం ఆవిష్కరణకు నోచుకోకుండా పడివుండటం అభిమానులను కలవరపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రముఖ సెంటర్ లో విగ్రహాన్ని ప్రతిష్టించారు కానీ..ఇంకా ఆవిష్కరణ జరగలేదు. పవర్ స్టార్ అభిమాని ఒకరు తయారు చేయించిన ఈ విగ్రహ ఆవిష్కరణకు పవన్ అనుమతి రాని నేపథ్యంలో ముసుగు వేసి అలా ఉంచేసారు. దీంతో విగ్రహంపై కప్పిన కవర్ తొలిగి దర్శనమిచ్చింది. తాజాగా ఇలా పడి ఉన్న విగ్రహం ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాడేపల్లిగూడెంకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన నాయకుడు సీతాల మోహన్చందు సిద్ధమయ్యారు. నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరుల ద్వారా ఈ విగ్రహ రూపకల్పను ఆలోచిస్తున్నట్టు దీనికి పవన్ అనుమతి తీసుకోనున్నట్టు 2014లోనే ప్రకటించారు. పవన్ యూత్ ఆధ్వర్యంలో అభిమానులంతా విగ్రహ ప్రతిష్టచేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అప్పట్లో వెల్లడించారు.
కాగా పవన్ కళ్యాణ్ కి ఇలా విగ్రహాలు పెట్టించుకోవడం ఇష్టం లేదని సమాచారం. దీంతో తమ అభిమాన హీరోకు నచ్చని పని చేయడం ఇష్టం లేక విగ్రహాన్ని అలా వదిలేసినట్టు తెలుస్తోంది. మరి తాజా పరిణామాలపై పవన్ అభిమానులు, పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.