1న సీఎం నివాసం ముట్టడి | Sakshi
Sakshi News home page

1న సీఎం నివాసం ముట్టడి

Published Sun, Apr 26 2015 11:26 PM

Rally for a solution to the demands of the mill workers

- డిమాండ్ల పరిష్కారం కోసం మిల్లు కార్మికుల నిర్ణయం
- గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడి
సాక్షి, ముంబై:
డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం వర్షా బంగ్లాను ముట్టడించాలని మిల్లు కార్మికులు నిర్ణయించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటిన గ్రాంట్‌రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ గా బయలుదేరి వెళ్లి వర్షా బంగ్లాను ఘేరావ్ చేయనున్నట్లు గిరిణ కామ్‌గార్ కృతి సమితి సభ్యులు తెలిపారు.

మిల్లు కార్మికులకు ఇళ్లు నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హ యాంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని బీజేపీ తెలిపింది. సమస్యల పరి ష్కారానికి 2015 జనవరి 20న గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి రవీంద్ర వాయ్‌కర్, అనంతరం ఫడ్నవీస్‌తో కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం సమావేశమై నివేదిక సమర్పించింది. అయితే అధికారంలోకొచ్చి ఏడునెలలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.

ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు
ఎంహెచ్‌ఏడీఏ వద్ద అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు ఎనిమిది వేల ఇళ్లు లభించనున్నాయి. అలాగే ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) 11 వేల ఇళ్లు నిర్మించింది. మొత్తం 19 వేలకుపైగా నివాసాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

అయితే వీటిని కార్మికులకు అందజేసే విషయంపై గాని, లాటరీ వేసే విషయం గానీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement