రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా | Sakshi
Sakshi News home page

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా

Published Sun, Sep 29 2013 3:48 AM

Regional partilade dominant in the coming days

రాయచూరు, న్యూస్‌లైన్ : రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, అవి తమ ఉనికిని కాపాడుకుంటూ బలోపేతం అవుతుండటమే దేశంలో తృతీయ శక్తిని తేటతెల్లం చేస్తోందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ అొ్కన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తున్న కాంగ్రెస్, నరేంద్రమోడీని ప్రతిపాదిస్తున్న బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు గత 30-40 ఏళ్లుగా ఈ రెండు పార్టీల వ్యతిరేక ధోరణులతో విసిగిపోయి రాజకీయంగా పోరాడుతున్నాయన్నారు. ఈ ప్రాంతీయ పార్టీల శక్తే భవిష్యత్తులో తృతీయ శక్తికి గట్టి పునాది కానుందన్నారు. కాంగ్రెస్ ఆర్డినెన్స్ ద్వారా ఏర్పడిన సంక్షోభం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తీవ్ర సంకటానికి గురిచేసిందన్నారు. ఆయన అధికారంలో ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రజలు విశ్లేషిస్తున్నారన్నారు. 2జీ స్పెక్ట్రం స్కాంలో చిదంబరానికి క్లీన్‌చిట్ ఇవ్వడంపై లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు సీబీఐ తీరుపై మండిపడ్డారన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జేడీఎస్‌ను విడగొట్టేందుకు నిరంతరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ శక్తులకు వ్యతిరేకంగా పటిష్టమైన పోరాటాలతో తమ పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమన్వయ సమితి ద్వారా చేతులు, నోరు కట్టేస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. పాకిస్తాన్‌తో శాంతి సంబంధాల కోసం ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడి మధ్య చర్చలపై అడిగిన ప్రశ్నకు.. అమెరికా సూచన మేరకు చర్చలు సాగించేంత వైఖరిలో భారత్ ఉండరాదని అభిప్రాయపడ్డారు. ఒబామా మధ్యవర్తిగా పాక్‌తో చర్చలు సమంజసం కాదన్నారు.

 జిల్లాలో నారాయణపుర కుడిగట్టు కాలువను నిర్మించామన్నారు. కృష్ణా బీ.స్కీం నీటి వినియోగంలో ప్రభుత్వం దృఢ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కృష్ణప్ప, జిల్లాధ్యక్షుడు మహంతేష్ పాటిల్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాజీ మంత్రులు, యువ నేతలు పవన్, ఎన్.శివశంకర్, తిమ్మారెడ్డి, ఎల్లప్ప, హరీష్ నాడగౌడ, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement