రైలును ఆపి డ్రైవర్ పరార్ | Sakshi
Sakshi News home page

రైలును ఆపి డ్రైవర్ పరార్

Published Thu, Mar 20 2014 11:51 PM

The driver stops the train

తిరువళ్లూరు, న్యూస్‌లైన్:
 పనిభారాన్ని తట్టుకోలేక కడంబత్తూరు రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపి డ్రైవర్ పరారవడంతో దాదాపు 45 నిమిషాల పాటు రైలు నిలిచిపోరుుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు కడంబత్తూరు స్టేషన్‌మాస్టర్ రామరాజమీనన్‌పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
 
 చెన్నై నుంచి అరక్కోణం వరకు నడిచే (నంబర్ 43409) రైలు ఉదయం 10.20 గంటలకు కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు రావాల్సి వుండగా 10.45 గంటలకు చేరింది. రైలును మొదటి ప్లాట్‌ఫాంపై నిలిపిన డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 25 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఇంజిన్ వద్దకు వెళ్లారు.
 
 అయితే అప్పటికే డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయి ఉండడంతో ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. దాదాపు అరగంట దాటుతున్నా రైలు ఎందుకు బయలుదేరడం లేదని వారు ప్రశ్నించారు. ఇందుకు స్టేషన్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు, స్టేషన్ మాస్టర్ రామరాజమీనన్ తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌పై దాడికి యత్నించారు.
 
ఈ తతంగాన్ని తిరువళ్లూరు, అరక్కోణం ప్రాంతాలకు వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్‌ఆర్‌ఎస్(లీవ్ రిజర్వ్‌డ్ సర్వీసు)లో ఉన్న డ్రైవర్‌ను అరక్కోణం నుంచి వస్తున్న లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా పిలిపించి సర్దుబాటు చేశారు. దీంతో అరక్కోణం నుంచి వచ్చిన డ్రైవర్‌తో దాదాపు 45 నిమిషాల తరువాత రైలును ముందుకు నడిపించారు.
 
 పని ఒత్తిడే కారణమా?
 కడంబత్తూరు రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపి వేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోవడానికి పని ఒత్తిడే కారణమని తెలుస్తుంది. బుధవారం డ్యూటీలోకి చేరిన డ్రైవర్‌ను గురువారం ఉదయం లోపు రిలీవ్ చేయాల్సి ఉంది. అయితే గురువారం ఉదయం చెన్నై వరకు వె ళ్లిన డ్రైవర్ తిరువళ్లూరుకు చేరుకున్న తరువాత తనను డ్యూటీ మార్చాలని కోరారు.
 
 అయితే అప్పుడు రావాల్సిన డ్రైవర్ రాకపోవడంతో రైలు కడంబత్తూరు వరకు నడపాలని, అక్కడే ఉన్న డ్రైవర్ రిలీవ్ చేస్తారని సర్దిచెప్పి పంపిం చారు. అయితే కడంబత్తూరుకు చేరుకున్నాక కూడా డ్రైవర్‌ను రిలీవ్ చేసే వారు లేకపోవడంతో ఆగ్రహించిన డ్రైవర్ రైలును కడంబత్తూరులో నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయారని రైల్వేలో పని చేస్తున్న అధికారి వెల్లడించారు.

Advertisement
Advertisement