రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్
బెంగళూరు: జెడీ, టీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల రిజర్వేషన్లను మరో మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ వెల్లడించారు. అసెంబ్లీ కార్యకలాపాల సందర్భంలో విపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుడు జగదీష్శెట్టర్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సాంకేతిక పరమైన సమస్యల వల్ల రిజర్వేషన్ వెల్లడి కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల నుంచి ఆయా రిజర్వేషన్లకు సంబంధించి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారని వీటిని పరిశీలించి తుది జాబితాను మరో మూడు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. కాగా, శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు ఇచ్చి సమాధాలు ఇలా...
కరువు నివారణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.214 కోట్లు విడుదల చేసిందని రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస ప్రసాద్ విధానపరిషత్కు తెలియజేశారు. సరైన వర్షపాతం లేని కారణంగా ఖరీఫ్ సీజన్లో 27 జిల్లాలను, రబీ సీజన్లో 12 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో 358 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, 32 గోశాలలను, 51 పశుగ్రాస బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస ప్రసాద్ వివరించారు.
రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో మూడేళ్ల కాలంలో నిర్వహించిన బృహత్ ఉద్యోగమేళ ద్వారా 23,254 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి పరమేశ్వర్ నాయక్ పరిషత్కు తెలియజేశారు. సదరు ఉద్యోగమేళాలను ప్రభుత్వ కళాశాలల్లో కూడా నిర్వహిస్తూ ఇన్ఫోసిస్, విప్రో తదితర కంపెనీల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.
రైతుల వ్యయసాయ భూముల యాజమాన్య అర్హతలను తెలియజేసే ‘పహణి’లో ఎటువంటి లోపాలు లేని తాలూకాగా రాష్ట్రంలోని మండ్యజిల్లా, పాండవపురను ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందని రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ పరిషత్కు తెలియజేశారు.
రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యంలోని 40 గ్రామాలకు రూ.88 కోట్ల నిధులతో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియ మొదలైందని ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ శాసనసభకు తెలియజేశారు.