హైదరాబాద్: రాష్ట్రంలో, దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద అన్నారు. ఆమెక్కిడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సీఎం, గవర్నర్ తమకు సమయం కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. అసలు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.
మంత్రి వర్గంలో కనీసం మహిళలకు ప్రాతినిథ్యం లేదని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అని చెబుతున్న ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేకపోతున్నదని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ లేఖ ద్వారా సీఎంను ప్రశ్నించనున్నట్లు తెలిపారు.