ప్రియురాలి పెళ్లి ఆపిన యువకుడు | Sakshi
Sakshi News home page

ప్రియురాలి పెళ్లి ఆపిన యువకుడు

Published Wed, Aug 30 2017 10:31 AM

ప్రియురాలి పెళ్లి ఆపిన యువకుడు

టీ.నగర్‌(తమిళనాడు): ప్రియురాలికి పెళ్లి జరుగుతోందని తెలిసి ఓ యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి తన వద్దకు రమ్మని చెప్పి వివాహాన్ని ఆపాడు. తమిళనాడు దిండివనం సమీపాన గల వోళప్పూరులో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. వోళప్పూరు వాషర్‌మెన్‌పేటకు చెందిన మురుగన్, అదే ప్రాంతానికి చెందిన ఒక యువతి ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం తెలిసి ఆ యువతి కుటుంబ సభ్యులు మేల్‌మరువత్తూరు సమీపాన అచ్చరపాక్కంకు చెందిన వేరొక యువకునితో ఆమెకు వివాహం చేసేందుకు నిర్ణయించారు. అచ్చరపాక్కంలోని కల్యాణమండపంలో మంగళవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది.

సోమవారం రిసెప్షన్‌ అనంతరం వధువు, వరుడు వేర్వేరు గదుల్లో బస చేశారు. ప్రియురాలికి వివాహం జరుగుతున్నట్లు తెలుసుకున్న మురుగన్‌ ఆమెతో సెల్‌ఫోన్‌లో మాట్లాడాడు. తాము వివాహం చేసుకుందామని అచ్చరపాక్కం కొండ దిగువ ప్రాంతానికి రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన వధువు కల్యాణమండపం నుంచి ఎవరికి తెలియకుండా చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. తెల్లవారుజామున వధువు కనిపించకపోవడంతో వివాహాన్ని ఆపేశారు. తరువాత ఎట్టకేలకు వధువు తల్లిదండ్రులు అచ్చరపాక్కం కొండ దిగువన కుమార్తెను కనుగొని దిండివనం మహిళా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు వధువును విచారించగా ప్రియుడు మురుగన్‌ వివాహం చేసుకుందామని చెప్పి రమ్మన్నాడని అయితే అతను అక్కడ కనిపించలేదని తెలిపింది. మురుగన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement