హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తన అనుచరులతో కలసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శ్రీనన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు పాలన ఎంత అన్యాయంగా ఉందో చెప్పడానికి ఈ చేరికలు నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలపుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రజలు చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కందుల దుర్గేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే.