రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ.. అంతలో | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ.. అంతలో

Published Sat, Apr 9 2016 8:06 PM

రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ.. అంతలో

బెంగళూరు (బనశంకరి): రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ దిగుతుండగా... మంగళ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి దంపతులతో సహా నలుగురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర సమీపంలో బసవనపుర వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నగరంలోని కొత్తనూరుకు చెందిన ప్రదీప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శుక్రవారం ఉగాది పండుగ జరుపుకున్న అనంతరం భార్య ప్రతిభ, మరో ఇద్దరితో కలిసి జీపులో మైసూరుకు విహార యాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. రామనగర జిల్లా బసవనపుర, వడేరహళ్లి మధ్య అన్‌మ్యాన్డ్ క్రాసింగ్‌లో రైలు పట్టాలపై జీపు నిలిపారు.

అనంతరం దంపతులు ట్రాక్‌పై నిలబడి మొబైల్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా మైసూరు నుంచి బెంగళూరుకు వెళ్లే మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. గమనించిన దంపతులు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు. రైలు వేగంగా జీపును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. రామనగర సీఐ కుమార్, చెన్నపట్టణ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ జేబీ మోకాశి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలపై ఉన్న జీపును తొలగించారు. దీంతో గంట ఆలస్యంగా మంగళ ఎక్స్‌ప్రెస్ బెంగళూరుకు బయలుదేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement