మనిషి అన్నాక పొరపాట్లు చేయడం సహజం. అయితే అవికాస్తా కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టిస్తాయి, మరికొన్ని సార్లు మంచి చేస్తాయి. అలాగే మరికొన్ని మనల్ని ఫేమస్ చేస్తాయి. సోషల్ మీడియాలో కూడా కొన్ని పారపాట్లు చేస్తారు. ఏదైనా విషయాన్ని ట్యాగ్ చేయడంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒకరిని బదులు మరొకరిని ట్యాగ్ చేస్తాం. అలా ట్యాగ్ చేసిన వ్యక్తి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు. అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన అరుణానంద్ అనే ట్విట్టర్ వినియోగదారుడు ఈనెల 20న సేలం ఆటోడ్రైవర్లపై ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. పర్యాటకుల నుంచి 1.5కిలోమీటర్లకే రూ.50 వసూలు చేస్తున్నారని తమిళనాడులోని సేలం పోలీసు డిపార్టుమెంట్ను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. అదికాస్తా అమెరికాలోని సేలం పోలీస్ డిపార్ట్మెంట్ ఒరెగాన్కు ట్యాగ్ అయింది. అయితే వారు ఇది అమెరికాలోని సేలం పోలీస్ డిపార్టుమెంట్ అంటూ సమాధానం ఇచ్చారు. దానిని అరుణానంద్ రిప్లై ఇస్తూ అమెరికాలో సేలం ఉందని నాకు తెలుసు. కానీ, పొరపాటున కూడా తప్పుగా ట్యాగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఒరెగాన్లో మద్రాస్ పేరుతో మరో సిటీ ఉందని గుర్తించాడు. వెంటనే దీనిపై పోస్టు పెడుతూ మద్రాస్ అమెరికాలో కూడా ఉందా, ఇది తమిళనాడుకు రాజధాని అంటూ పోస్టు చేశాడు.
ఇప్పుడు అరుణానంద్, ఒరెగాన పోలీసుల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలల్లో రీట్వీట్లు, లైకులు వచ్చాయి. అయితే దీనిపై ఉత్తర్ప్రదేశ్ పోలీసులు కూడా స్పందించారు. మాకు సమానమైనా వారు ఎవరూ లేరు, మేము ఒక్కరిమే, ఏదైనా సహాయం కావాల్సి వస్తే ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దూ అంటూ ట్వీట్ చేశారు.