అమ్మకానికి ఆడపిల్ల | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆడపిల్ల

Published Wed, Aug 3 2016 6:32 AM

అమ్మకానికి ఆడపిల్ల

కన్నవారికి పదివేలిచ్చి రూ.50 వేలకు అమ్ముకున్న మధ్యవర్తి
యాచారం: కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే పసిపాప అమ్మకానికి గురైంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మధ్యవర్తి రూ.10 వేలిచ్చి, ఆ పసికందును రూ.50 వేలకు అమ్ముకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సర్దార్‌తండాకు చెందిన శిరీష, రవిలకు ఇద్దరు ఆడపిల్లలు. 4 రోజుల క్రితం శిరీష దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరికి బంధువైన కేతావత్ చక్రి అనే మహిళ హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉంటోంది.

శిరీష, రవిలకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని అమ్మకానికి ఒప్పించింది. సోమవారం రాత్రి 4 రోజుల పసిపాపను తల్లిదండ్రుల నుంచి తీసుకుని రూ. 50 వేలకు వేరే వారికి అమ్మేసింది. పాప తల్లిదండ్రులకు మాత్రం రూ.10 వేలే ఇచ్చింది. అనంతరం పాపతోపాటు ఆమెను కొన్నవారితో ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. విషయం బయటపడ టంతో పోలీసులు సాగర్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. చక్రితోపాటు పాపను కొనుగోలు చేసిన సునీత, ధనలక్ష్మి, రవికిరణ్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పసికందును శిశువిహార్‌కు తరలించారు.

Advertisement
Advertisement