♦ భర్తను చూసేందుకు వెళ్తున్న మహిళను ఢీకొన్న కారు
♦ అక్కడికక్కడే దుర్మరణం
శంషాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో నిండుప్రాణం బలైంది. తన భర్తను చూసేందుకు వెళ్తున్న ఓ మహిళను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడకు చెందిన శివలీల తన మేనత్త కాట్రావత్ దేవి(40)తో కలసి చికిత్స కోసం శంషాబాద్ వచ్చింది. తిరుగు ప్రయాణంలో వీరు తొండుపల్లి వద్ద ఔటర్ జంక్షన్లో లారీ ఎక్కారు. ఔటర్పై శివలీల భర్త జగన్, దేవి భర్త భిక్య కూలీలుగా పనిచేస్తున్నారు.
వీరి వద్దకు వెళ్లడానికి శివలీల, దేవి హమీదుల్లానగర్ సమీపంలో ఔటర్పై లారీ దిగారు. అక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. శంషాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇండికా కారు వేగంగా వచ్చి దేవిని ఢీకొంది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెం దింది. ఈ హఠాత్పరిణామానికి శివలీల షాక్కు గురై స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.