ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

Published Tue, Sep 15 2015 5:51 PM

ACB Caught VRO

కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మికుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మట్టా అంజిరెడ్డి తండ్రి రాజిరెడ్డి పేర గుండేడు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే దీనికి సంబంధించిన పహాణీ కాపీలో మిట్టా రాజిరెడ్డి అని ఉంది. దీంతో పేరును సరిచేయడంతోపాటు సర్వే నంబర్ 15లో ఉన్న 30 కుంటల భూమి వివరాలను పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదు చేయాలంటూ అంజిరెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ఈ పని చేసేందుకు రూ.18వేలు లంచం ఇవ్వాలని గుండేడు వీఆర్వో రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. లోగడ రూ.2 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.16 వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మంగళవారం కమలాపూర్‌లోని ఓ జిరాక్స్ షాపులో అంజిరెడ్డి నుంచి రూ.16 వేలను తీసుకుంటుండగా వీఆర్వో రమేశ్‌బాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement