ప్రమాదాల నివారణకు చర్యలు | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు

Published Fri, Apr 17 2015 12:36 AM

Actions prevent accidents

దేవరకొండ/చింతపల్లి :  రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ విక్రమ్‌జీత్‌దుగ్గల్ తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు మండలాల పోలీస్‌స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి క్రైమ్‌రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రహదారులపై అవసమున్న చోట త్వరలోనే పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినట్టు వివరించారు. విద్యార్థులు, మహిళలను వేధించే పోకిరీల ఆగడాలను నిరోధించేందుకు షీటీమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, కాలేజీలు, పార్కులతో పాటు పబ్లిక్ ప్రదేశాలలో మహిళలను వేధించే ఆకతాయిలు ఇకనుంచి జైలు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు.
 
 శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
 జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ చెప్పారు. గురువారం ఆయన దేవరకొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు.  సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి, చందంపేట, డిండి పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. 

Advertisement
Advertisement