Sakshi News home page

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

Published Mon, Mar 2 2015 5:30 AM

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి - Sakshi

- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు


సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ఫలాలు దేశంలో అన్ని వర్గాలకు అందాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిలషించారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ప్రథమవర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, రిటైర్డు జడ్డి టి.వి.నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అట్టడుగువర్గాల భాగస్వామ్యం లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగువర్గాలకు అందకుంటే దానికి అర్థమేలేదని వ్యాఖ్యానించారు. పార్టీ జాతీయ అధ్యక్షునిగా బంగారు లక్ష్మణ్ అట్టడుగువర్గాల అభ్యున్నతికోసం అనుక్షణం తపనపడ్డారని కొనియాడారు. పార్టీ సామాజిక విస్తరణకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. దళితులను, మైనారిటీలను ఇప్పటిదాకా ఓటుబ్యాంకుకోసం వాడుకున్నాయని విమర్శించారు. బీజేపీలోని దళిత ఎంపీలు ఎక్కువగా ఉన్నారన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బంగారు లక్ష్మణ్ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీకి కూడా పార్టీ నేతలు నివాళులు అర్పించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement