రేపు రాష్ట్రానికి అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రానికి అమిత్‌ షా

Published Mon, Apr 8 2019 2:16 AM

Amit Shah visit to state on tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 9న (రేపు) రాష్ట్రానికి రానున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌రెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. దీని లో భాగంగా శంషాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్స్‌లో ఉదయం 10:30కి నిర్వహించే బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ కూడా పాల్గొననున్నారు. హైదరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి సోమవారం (నేడు) ఉదయం 11:30కి బైక్‌ర్యాలీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దారుల్‌సఫాలో మైనార్టీలతో సమావేశమవుతారు. తర్వా త 2 గంటలకు అక్కడ నిర్వహించే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు.

అదే రోజు ఉదయం 11 గంటలకు దేవరకద్రలో నిర్వహించే మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పాల్గొననున్నారు. సాయంత్రం 5కి సంగారెడ్డిలో నిర్వహించే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాదాపూర్‌లోని బుట్టా కన్వెన్షన్‌లో నిర్వహించే సమావేశంలో సాయంత్రం 5గంటలకు పాల్గొంటారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. చేవెళ్లలో పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా శేరిలింగంపల్లిలో కేంద్రం మంత్రి పురుషోత్తం రూపాల నిర్వహించిన ఐటీ ప్రొఫెషనల్స్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్‌లలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

Advertisement
Advertisement