Sakshi News home page

వార్షిక రుణ ప్రణాళిక రూ. 4,112 కోట్లు

Published Mon, May 26 2014 11:39 PM

వార్షిక రుణ ప్రణాళిక రూ. 4,112 కోట్లు - Sakshi

- గతేడాదితో పోలిస్తే 24.69 శాతం వృద్ధి
- పంట రుణ  వితరణ లక్ష్యం రూ. 1,758 కోట్లు
- ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు.. రబీలో రూ. 573 కోట్లు
- తాజా లక్ష్యాలపై రైతుల ఆశలు

 
 సాక్షి, సంగారెడ్డి : వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. గతేడా ది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.3,097 కోట్లు కాగా.. 24.69 శాతం పెంపుదలతో ఈ ఆర్థిక సం వత్సరంలో రూ. 4,112 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లక్ష్యం లో రూ.1,015 కోట్ల రుణ వితరణను పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,134 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాలనే టార్గెట్‌ను పెట్టుకోగా..ఈ ఏడాది లక్ష్యాన్ని రూ.1,758 కోట్లకు పెంచింది. ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు, రబీలో రూ. 573 కోట్ల రుణాలను అన్నదాతలకు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు నిర్దేశించారు. ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశిస్తూ లీడ్ బ్యాంక్ రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆవిష్కరించారు.

లక్ష్యాలు పెంపు..
తాజా వార్షిక ప్రణాళికలో అన్ని రంగాల రుణ లక్ష్యాల్లో భారీ వృద్ధి కనిపించింది. ప్రాధాన్యత రంగాలకు రూ. 2,737 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని గతేడాది లక్ష్యాన్ని విధించుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాన్ని రూ.3,680 కోట్లకు పెంచారు. అంశాల వారీగా పెరిగిన లక్ష్యాలను పరిశీలిస్తే.. గతేడాది ప్రణాళికలో వ్యవసాయ కాలపరిమితి రుణ లక్ష్యం రూ.198 కోట్లు కాగా ఈ ఏడాది రూ.237 కోట్లకు  పెంచారు. అదే విధంగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణ లక్ష్యాన్ని రూ.126 కోట్ల నుంచి రూ.151 కోట్లకు పెంచారు. వ్యవసాయేతర రుణ లక్ష్యాన్ని రూ.252 కోట్ల నుంచి రూ.302 కోట్లకు పెంచారు.

ఇతర ప్రాధాన్యత రంగాల రుణ లక్ష్యాన్ని రూ.271 కోట్ల నుంచి రూ.525 కోట్లకు పెంచారు. స్వ యం సహాక సంఘాల రుణ లక్ష్యాన్ని రూ.486 కోట్ల నుంచి రూ.583 కోట్లకు  పెంచారు.  సూక్ష్మ, చిన్న, మధ్యతరహ కమతాలకు రుణ లక్ష్యాన్ని రూ.270 కోట్ల నుంచి రూ.324 కోట్లకు పెంచారు. అదే విధంగా ప్రా ధాన్య యేతర రంగాల్లో గతేడాది రూ.360 కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 432 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

గతేడాది లక్ష్యాలు అసంపూర్తి
గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,097 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నప్పటికీ కేవలం 86 శాతం లక్ష్య ఛేదనతో 2,667 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేయగలిగారు. వ్యవసాయ, ఎస్‌హెచ్‌జీ రంగాలు మినహాయిస్తే ఇతర  రంగాల లక్ష్యాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ప్రభుత్వ ప్రోత్సాహాక పథకాలకు రుణాల పంపిణీని నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాంకర్లు లబ్ధిదారులకు ఉదారంగా రుణాలు పంపిణీ చేయాల్సిన అవసరముంది.
 
ప్రణాళికను విడుదల చేసిన కలెక్టర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన 2014-15 వార్షిక రుణప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రణాళిక ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాల్సి ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈనెల 28 లోపు ఆవిష్కరించాల్సిందిగా ఎస్‌ఎల్ బీసీ ఆదేశించిందన్నారు. ఈ ప్రణాళికలో పంట రుణాలను గత ఎడాది లక్ష్యంపై 50 శాతం పెంచి రూ. 1,758 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర రుణాల కోసం రూ.4,112 కోట్లు నిర్ణయించామన్నారు. ఆవిష్కరణలో లీడ్ బ్యాంక్ మెనేజర్ వెంకటయ్య, ఏఎల్‌డీఎం రఘురామ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement