మరో 42 మందికి.. | Sakshi
Sakshi News home page

మరో 42 మందికి..

Published Mon, May 18 2020 3:55 AM

Another 42 Corona Cases Were Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారుల ద్వారా మూడు కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు.

పురుషుల్లోనే వైరస్‌ కేసులు అధికం...
రాష్ట్రంలో కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారు. శనివారం సాయంత్రం వరకు 23,388 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,513 కేసులు నమోదయ్యాయని బులెటిన్‌లో పేర్కొ న్నారు. అందులో 947 మంది పురుషులు, 566 మంది మహిళలు ఉన్నారు. నెగెటివ్‌ వచ్చిన వారిలో 14,256 మంది పురుషులు, 7,619 మంది మహి ళలు ఉన్నారు. పరీక్షల ఆధారంగా పురుషుల్లో 6% మందికి, మహిళల్లో 7% మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక చేసిన పరీక్షల్లో 93% మంది మహిళ లకు నెగెటివ్‌ రాగా 94% మంది పురుషులకు నెగెటివ్‌ వచ్చినట్లు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక వయసులవారీగా పరిశీలిస్తే 15 ఏళ్లలోపు చిన్నా రుల్లో 218 మంది కరోనా బాధితులు ఉన్నారు.

ఒకే ఇంట్లో 15 మందికి పాజిటివ్‌..
అబిడ్స్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోషామహల్‌ సర్కిల్‌–14లో ఉన్న జుంగూర్‌బస్తీలో ఆదివారం ఒకేరోజు 15 మందికి కరోనా సోకింది. జుంగూర్‌ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్‌ ఉద్యోగి (36)కి ఐదు రోజుల క్రితం వైరస్‌ సోకగా అతని కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించా రు. వారికి పరీక్షలు నిర్వహించగా ఉద్యోగి తండ్రి (56), అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ఇంట్లోని బంధువులందరికీ కలిపి 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు పురానాపూల్‌ చౌరస్తాలోని ఎస్‌బీఐ శాఖ నుంచి ఇటీవల నగదు డ్రా చేసుకొని వెళ్లిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు బ్యాంక్‌లో పనిచేసే 13 మంది సిబ్బంది, అధికారులను క్వారంటైన్‌కు తరలించారు.

Advertisement
Advertisement