నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణను పోలీసులు ఆర్మూరులో అరెస్టు చేసి 5వ టౌన్కు తరలించారు. మంగళవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్దకు బయల్దేరిన యెండలతో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ తుల శ్రీనివాస్రెడ్డిలను పోలీసులు ఆర్మూర్లో అరెస్టు చేశారు.
పార్టీ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్, యువ మోర్చా నగర అధ్యక్షుడు రోషన్ లాల్ బోరా, నాయకులు నగోలా లక్ష్మీనారాయణ, పుట్ట వీరేందర్, చైతన్య కులకర్ణి, గోవుర్ శ్రీనివాస్, నరేష్, సంజీవ్ కార్యకర్తలు 5వ టౌన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.