డబ్బిస్తేనే .. రక్తమిస్తున్నారు | Sakshi
Sakshi News home page

డబ్బిస్తేనే .. రక్తమిస్తున్నారు

Published Fri, Jul 4 2014 11:56 PM

డబ్బిస్తేనే .. రక్తమిస్తున్నారు - Sakshi

సిద్దిపేట టౌన్ : ‘రక్తాన్ని సేకరించి బాధితులకు అందజేస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.’ ఈ విలువ తెలిసిన సిద్దిపేటలోని పలు స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని పట్టణంలోని ఏరియా ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో 30 శాతం వరకు నిల్వ చేస్తున్నారు. అయితే దాతలకు గాని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రక్తం అవసరం వస్తే ఆస్పత్రి సిబ్బంది ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు.
 
 
 వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేటలో వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్, స్ఫూర్తి లయన్స్‌క్లబ్, పతాంజలి యోగ సమితి మొదలగు సుమారు 20 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు పని చేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో వారు ర క్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని హైదరాబాద్‌లోని మెటోడిన్, సంజీవిని, జనని మొద లగు బ్లడ్‌బ్యాంక్‌లకు అందిస్తున్నారు. సంబంధిత బ్లడ్ బ్యాంక్‌లు రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, బహుమతులు, ప్రశంస పత్రాలు, డోనర్ కార్డులను, ప్రత్యేక బహుమతులను, బీమా పత్రాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా సుమా రు రూ.1000 విలువైన బ్లడ్ గ్రూప్ వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ అందజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలకు, వారి బంధుమిత్రులకు ఎలాంటి గ్రూపు రక్తానైన్నా ఉచితంగా అందజేసి ఆదుకుంటున్నారు. శిబిర నిర్వాహకులు లేఖ రాస్తే ఉచితంగా బ్లడ్ అందజేస్తున్నారు.
 
 రక్తం మాకే... కాసులు మాకే...:
 రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తంలో 30శాతం రక్తాన్ని స్వచ్ఛంద సంస్థలు సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌కు అందజేస్తున్నారు.   సిద్దిపేట ఆస్పత్రుల్లో అత్యవసరమైనప్పుడు ప్ర భుత్వ వైద్యులు స్వచ్ఛంద సంస్థలకు ఫో న్ చేసి రక్త దాతల ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలం గా వారు ఏమి ఇవ్వడం లేదు. చివరికి రక్తం అవసరమైతే కూడా సరిగా స్పం దించడం లేదు.  రూ. 1050 చెల్లిస్తేనే రక్తాన్ని అందజేస్తున్నారు.  
 
 స్వచ్ఛంద సంస్థలపై  గరంగరం
 సామాజిక సేవలో భాగంగా రక్తదానం శిబిరాలను నిర్వహించే స్వచ్ఛంద సంస్థలను కొందరు వైద్యాధికారులు బెదిరిస్తున్నారు. అనుమతి లేనిదే రక్తదాన శిబిరాలు నిర్వహించ వద్దని చెబుతున్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నోటీసులు కూడా అందజేస్తున్నారు. సేకరించిన రక్తం అంతా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛంద సంస్థలు బేజారవుతున్నాయి. సేవలకు కూడా ఇలా ఆటంకం పర్చడం సరైంది కాదంటున్నారు.
 
 ఉచితంగా ఇచ్చే నిబంధనలు లేవు..
 సేకరిస్తున్న రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అంద జేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు, ఆస్పత్రులకు రక్తాన్ని డబ్బులు తీసుకుని అందిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలకు, శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి ఉచితంగా రక్తం ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవు.
 - డాక్టర్ రాంమోహన్, బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జ్
 
 
 సేవలకు గుర్తింపు లేదు..
 రక్తదాన శిబిరాల నిర్వహణకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒర్చి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అప్పగిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మేము సిఫార్సు చేస్తున్న వ్యక్తులకు ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్ వారు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నారు. అయితే సిద్దిపేట వైద్యాధికారులు మాత్రం రక్తం లేదంటున్నారు. డబ్బు ఇస్తేనే రక్తాన్ని ఇస్తున్నారు.
 - శివశ్రీనివాస్, రక్తదాన శిబిర ఇన్‌చార్జ్
 

Advertisement
Advertisement