అభిమానికి హరీశ్‌రావు బాసట  | Sakshi
Sakshi News home page

అభిమానికి హరీశ్‌రావు బాసట 

Published Sat, Apr 20 2019 5:10 AM

Boy pedals from Mulugu to Hyderabad to meet Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేటజోన్‌: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు బాసటగా నిలిచారు. అధికారుల చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేకపోవడంతో తన సమస్యను విన్నవించుకునేందుకు వారం కింద సైకిల్‌ యాత్ర చేపట్టి శుక్రవారం నేరుగా హరీశ్‌ నివాసంలో ఆయనను కలిశాడు. ములుగు జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిల్ల తరుణ్‌.. సైకిల్‌పై హైదరాబాద్‌లోని హరీశ్‌ నివాసానికి వచ్చి కలిశాడు. ‘నేను మీ అభిమానిని అన్న. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ. అమె భూమిని వెంకటాపురానికి చెందిన కొంతమంది కబ్జా చేశారు. ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీస్‌ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు.

మిమ్మల్ని కలవాలని గత వారం క్రితం వెంకటాపురం నుంచి సైకిల్‌ యాత్రతో బయలుదేరి వచ్చాను. మీరే నన్ను ఆదుకోవాలి..’అని విన్నవించాడు. దీనిపై హరీశ్‌ వెంటనే స్పందించారు. అక్కడి సీఐ, ఎమ్మార్వోలతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పారు. తరుణ్‌ సమస్య పరిష్కారానికి హరీశ్‌ భరోసానిచ్చారు. రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. హరీశ్‌ ఆదేశాలతో ములుగు ఆర్డీవో వెంటనే స్పందించారు. తరుణ్‌ ఫిర్యాదు అంశంపై పత్రికా ప్రకటన జారీ చేశారు. విచారణ జరిపి తాజా పరిస్థితిని వివరించారు. దుర్గమ్మ భూమి విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Advertisement
Advertisement