ఉపాధ్యాయ నోటిఫికేషన్లు రద్దు చేయండి | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ నోటిఫికేషన్లు రద్దు చేయండి

Published Wed, Oct 25 2017 2:36 AM

Cancel teacher posts notifications

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,700లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన పలు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టు లో పిటిషన్‌ దాఖలైంది. ఉపాధ్యాయ నియామకాల రూల్స్, నోటిఫికేష న్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు చెందిన కె.బాలకృష్ణ ముదిరాజ్, కె.భాను, ఆర్‌.రామ్మో హన్‌రెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

రూల్స్‌కు సంబంధించిన జీవో 25పై స్టే విధించి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో జిల్లాను ఓ యూనిట్‌గా నియామకాలు చేపట్టేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొ న్నారు. అధికరణ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వు లకు విరుద్ధంగా ఉపాధ్యాయ నియామక రూల్స్‌ను ప్రభుత్వం జారీ చేసిందని పిటిషనర్లు తెలిపారు.

31 జిల్లాలను యూని ట్‌గా తీసుకోనున్నట్లు రూల్స్‌లో పేర్కొన్నా రని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. 31 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 10 జిల్లా లకే గుర్తింపు ఉందని అన్నారు. ఈ ఉత్తర్వు లకు విరుద్ధంగా రూల్స్‌ను తయారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల పలువురు అభ్యర్థులు ఆయా జిల్లాలకు నాన్‌ లోకల్‌ అవుతారని తెలిపారు.

కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తుండటంతో కొన్ని జిల్లాలకు అసలు పోస్టుల భర్తీయే ఉండటం లేదన్నారు. రంగారెడ్డి, నిర్మల్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో పోస్టుల భర్తీయే లేదని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు.  

Advertisement
Advertisement