మళ్లీ పెన్షన్ సర్వే! | Sakshi
Sakshi News home page

మళ్లీ పెన్షన్ సర్వే!

Published Fri, Nov 21 2014 11:14 PM

candidates selected as derangement in jogipet

 జోగిపేట: నగర పంచాయతీ పరిధిలో పెన్షన్ అర్హుల ఎంపిక సక్రమంగా జరుగలేదని తేలడంతో మళ్లీ వారం రోజుల్లో మండల స్థాయి అధికారులతో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని అందోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాష తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని తహిశీల్దారు కార్యాలయంలో పెన్షన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.

 ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందిని అర్హులుగా గుర్తించారు? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగిందని స్పెషల్ ఆఫీసర్ నగర పంచాయతీ కమిషనర్  విజయలక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన  సమాధానం చెప్పకపోవడంతో ఆమెపై యాస్మిన్‌బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో 2408 మంది పెన్షన్‌కు అర్హతలేని వారు దరఖాస్తు చేసుకున్నారు. 175 దరఖాస్తులు తొలగించారు. కాగా 2233 దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా 1382 మందిని ఇప్పటి వరకు ఎంపిక చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా 900 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.

 ఎక్కడా లేని విధంగా ఇక్కడ 98 శాతం అర్హులు ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్ని గైడ్‌లై న్స్ ఇచ్చిందని, వాటిని ఏమీ పట్టించుకోకుండా అర్హులను గుర్తించినట్లు తెలుస్తుందన్నారు. పెన్షన్ దారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఎప్పటి నుంచి కొత్త పెన్షన్‌లు మంజూరు చేసిందో అప్పటి నుంచి పెన్షన్ డబ్బులు చెల్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పెన్షన్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు తనను పంపించారని, కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేసి ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement