సేవాకార్యక్రమాలకు ఎల్లపుడూ బాసటగా ఉంటా: సమంత | Sakshi
Sakshi News home page

సేవాకార్యక్రమాలకు ఎల్లపుడూ బాసటగా ఉంటా: సమంత

Published Mon, Feb 9 2015 10:33 PM

సేవాకార్యక్రమాలకు ఎల్లపుడూ బాసటగా ఉంటా: సమంత

హైదరాబాద్: ‘సిటి ఆఫ్ చారిటి’ ఇష్టాగోష్టి  సోమవారం హైదరాబాద్‌లోని సాక్షిటవర్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటి సమంత హాజరయ్యారు.  ఇటీవల సాక్షి సిటిప్లస్‌లో పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన కథనాలు ‘సిటి ఆఫ్ చారిటి’ పేరుతో ప్రచురితమైయ్యాయి. ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత వ్యవహరించారు.

కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ...‘‘ తోటివారికి సాయపడటమే నిజమైన సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేతప్ప ఈ ప్రపంచంలో మనిషికి సంతోషం డబ్బువల్లా, పేరువల్లా రాదు. సాక్షి చేపట్టిన ఈ సేవాప్రచారానికి నేను ఎల్లప్పుడు బాసటగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు.

సాక్షి ఛైర్‌పర్సన్ వైఎస్ భారతి మాట్లాడుతూ ‘సమాజంలో ఏ ఒక్కరు సేవాపథంలో నడిచినా సాక్షి వారి వెన్నంటి ఉంటుంది. చిన్నవయసులో ప్రత్యూష సపోర్ట్ పేరుతో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను, ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రత్యూష సపోర్ట్ కో ఫౌండర్ డాక్టర్ మంజులను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పదిమందిలో సేవాభావాన్ని పెంపొందించే ‘సిటి ఆఫ్ ఛారిటి’ కథనాలు ఎప్పటికీ కొనసాగుతాయి’’ అని అన్నారు.

ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ‘‘సేవ చేసే గుణమున్న ప్రతి ఒక్కరిని సాక్షి అభినందిస్తుంది. సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఇంతమంది సహృదయుల్ని ఒకవేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి డైరెక్టర్లు కేఆర్‌పి రెడ్డి, వైఈపి రెడ్డి, పివికే ప్రసాద్, రాణిరెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 
 

Advertisement
Advertisement