Sakshi News home page

కామారెడ్డికి మహర్దశ

Published Sun, Jan 18 2015 6:05 AM

cm kcr kamareddy tour on 22jan or 24 jan

కామారెడ్డి : కామారెడ్డి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు, అధికారిక ప్రకటన చేయడానికి చర్యలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆయన ఈ నెల 22 లేదా 24న కామారెడ్డిలో పర్యటించనున్నారని సమాచారం. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తోపాటు జేఏసీ, విద్యార్థి నేతల కు సీఎం ఈ విషయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఈ ప్రాంత ప్రజలలో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను పరిశీలించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను సీఎం ఆదేశించడంతో అధికారులు శనివారం ఇల్చిపూర్, అడ్లూ ర్ శివార్లలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సంబంధిత రికార్డుల ను కలెక్టర్‌కు నివేదించారు. మూడు జిల్లాలకు కూడలి అయిన కా మారెడ్డి జిల్లా అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెం దనుంది.

కామారెడ్డికి యూనివర్సిటీ వచ్చే అవకాశాలుం టాయి. ఇప్పటికే పట్టణం ఎటూ నాలుగైదు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. జిల్లాగా మారితే మరింత విస్తరించవచ్చని భావిస్తున్నారు. నాలుగు లేన్ల జాతీయ రహదారి, కరీంనగర్ నుంచి కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి వరకు రాష్ట్రీయ రహదారులు, బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ వంటి వస తులు ఉండడంతో కామారెడ్డికి   వలస వచ్చేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది.
 
ఆలోచింపజేసిన ‘సాక్షి’ కథనాలు
కామారెడ్డి పర్యటన సందర్భంగా సీఎం జిల్లా ఏర్పాటు అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగితే కామారెడ్డికి కూడా అవకాశం లిగిం చాలని, అందుకు గల అర్హతలు, సౌకర్యాలను చూపుతూ 2013 ఆగస్టు 25న ‘ఆశల పల్లకిలో కామారెడ్డి జిల్లా’ అన్న కథనాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఇది ఈ ప్రాంత నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నేతలు, న్యాయవాదులు, ప్రజాసంఘాలను ఆలోచనలో పడేసింది.

స్థానిక జేఏసీ నేతలు ‘కామారెడ్డి జిల్లా సాధనా సమితి’ని ఏర్పాటు చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత కామారెడ్డిని మెదక్ లేదా సిద్ధిపేట జిల్లాలలో విలీనం చేస్తారన్న ప్రకటనలు వెలువడడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. చాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యం  లోనూ మరోసారి అఖిలపక్షం సమావేశమై చర్చించింది. అయితే, జిల్లాల ఏర్పాటు విషయంలో కొంత సమయం పడుతుందని సీఎం ప్రకటించడం, కామారెడ్డిని జిల్లా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రకటించడంతో ఉద్యమం ఆగింది.

జిల్లాల ఏర్పా టు, ఇతర జిల్లాలలో విలీనం వంటి వార్తలపై ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో కాలేజీ ఆస్తుల విషయంలో సీఎం ను కలిసిన ఎమ్మెల్యే, జేఏసీ, విద్యార్థి నేతలకు కామారెడ్డిని జిల్లా చేస్తానని, త్వరలోనే కామారెడ్డిలో ప్రకటిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.

Advertisement
Advertisement