వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి

Published Mon, Mar 28 2016 2:45 AM

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి - Sakshi

బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి
 
శ్రీరాంపూర్ :  సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని శిశుమందిర్ పాఠశాలలో కోల్‌బెల్ట్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ల ముందు కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వస్తే వారసత్వ ఉద్యోగాలు వస్తాయనుకుంటే అవీ రాలేదన్నారు. ఓసీపీలను అడ్డుకొంటామని, అవి రాకుండా అడ్డంగా కుర్చీ వేసుకుంటామని చెప్పిన ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఓసీపీలను ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

 ఘన సన్మానం..
పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా కోల్‌బెల్ట్ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా  పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల రవి, యువజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డిల ఆధ్వర్యంలో మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మున్నారాజ్‌సిసోడియా, నాయకులు బుద్దె రాజన్న, గోళ్ల మహేందర్, స్వామిరెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మల్లక్క, వినోద పాల్గొన్నారు.

Advertisement
Advertisement