కరోనా చర్యలపై కాంగ్రెస్‌ అఖిలపక్షం | Sakshi
Sakshi News home page

కరోనా చర్యలపై కాంగ్రెస్‌ అఖిలపక్షం

Published Tue, Apr 14 2020 5:28 AM

Congress All-Party meeting About Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిం ది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంలకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి పార్టీ పరంగా తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వపరంగా అందుతున్న సాయం గురించి చర్చించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ముగిసేంతవరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సాయం చేయాలని, అవసరమైన చోట్ల ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పేదలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీపీసీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్, సభ్యులు దామోదర రాజనర్సింహ, సంపత్‌కుమార్, దాసోజు శ్రవణ్‌కుమార్, ఆర్‌.దామోదర్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాములు నాయక్, అబ్దుల్‌ సోహైల్, ఇందిరాశోభన్‌లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పలువురు డీసీసీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల్లోని పరిస్థితులను టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి వివరించారు.
 

Advertisement
Advertisement